Telugu Gateway
Telangana

ప్రముఖ డాక్టర్ కాకర్ల సుబ్బారావు మృతి

ప్రముఖ డాక్టర్ కాకర్ల సుబ్బారావు మృతి
X

దేశ విదేశాల్లో వైద్య రంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూనే ఆయన శుక్రవారం ఉదయం కన్నుమూశారు. అమెరికాలోని పలు ఆస్పత్రుల్లో సేవలు అందించిన ఆయన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పిలుపు మేరకు రాష్ట్రానికి తిరిగొచ్చి ఇక్కడే సేవలు అందించారు. కాకర్ల సుబ్బారావు 1925లో కృష్ణా జిల్లా పెదముత్తేవిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పాఠశాల విద్యాభ్యాసం చల్లపల్లిలో, కళాశాల విద్యాభ్యాసం మచిలీపట్నం హిందూ కళాశాలలో సాగింది.

విశాఖ ఆంధ్ర వైద్య కళాశాల నుంచి డాక్టర్‌ పట్టా పొందారు. 1951లో హౌస్‌ సర్జన్‌ చేసిన తర్వాత వైద్యంలో ఉన్నత విద్య కోసం ప్రత్యేక పారితోషికంతో అమెరికా వెళ్లారు. అమెరికా రేడియాలజీ బోర్డు పరీక్షల్లో 1955లో ఉత్తీర్ణులయ్యారు. 1986లో ఎన్టీ రామారావు ప్రవాస ఆంధ్రులకు చేసిన విజ్ఞప్తి మేరకు కాకర్ల స్వదేశానికి తిరిగి వచ్చి హైదరాబాద్‌ నిమ్స్‌లో కీలక బాధ్యతలు చేపట్టారు. నిమ్స్‌ లోని అన్ని విభాగాలను అభివృద్ధి చేశారు. రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటైన స్థాయికి నిమ్స్‌ను తీసుకొచ్చారు. వైద్యశాఖకు, మానవాళికి చేసిన సేవకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం నుంచి 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు పొందారు.

Next Story
Share it