మోడీ ఎందుకిలా?!
ప్రస్తుతం దేశంలో అత్యంత శక్తివంతంగా ఉన్న ప్రధాని మోడీ భయపడుతున్నారా..లేక సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నారా?. ఆయన డైలాగులు చూసిన వారికి ఎవరికైనా ఇదే సందేహం రావటం ఖాయం. దేశంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు వచ్చినా మోడీ నుంచి వచ్చే డైలాగులు మాత్రం ఏమీ మారటం లేదు. అందుకే అయన స్క్రిప్ట్ రైటర్ ను మార్చరా అని రాజకీయ నేతలు కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా ఆయన త్వరలో ఎన్నికలు జరగనున్న ఛత్తీస్ గఢ్ లో పర్యటించారు. పలు కొత్త పనులకు శ్రీకారం చుట్టారు. పనిలో పనిగా అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ పార్టీ కి ఎటిఎం లాగా మారింది అంటూ ఆరోపించారు. అంతే కాదు...తనకు సమాధి తవ్వాలని చూస్తారు అని...తనపై కుట్రలు చేస్తారు...వెంటాడుతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మూలంలోనే అవినీతి ఉంది..అదే వారి శ్వాస ఉంటూ విమర్శలు గుప్పించారు. గతంలో కూడా మోడీ ఇదే తరహాలో సమాధి తవ్వుతారు అంటూ కామెంట్స్ చేశారు. ఇవన్నీ చూస్తే మోడీది అంతా పాత స్క్రిప్ట్ అనే విషయం అర్ధం అవుతోంది. గతం లో ఒకసారి కాంగ్రెస్ నేత ఒకరు తనను అంతమొందించేందుకు పాకిస్థాన్ లో ఉన్న వాళ్లకు సుపారీ ఇచ్చారు అని మోడీ సంచలన ఆరోపణలు చేశారు.