నిన్న కొట్టారు..నేడు కేక్ పెట్టారు
సోమిశెట్టి సుబ్బారావు గుప్తా. ఏపీ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా ఆయన పేరు మారుమోగిపోతుంది. ఓ బహిరంగ సభలో ఆయన వైసీపీ మేలు కోసం అంటూ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలకు చికాకు తెప్పించాయి. దీంతో కొంత మంది వైసీపీ నేతలే సుబ్బారావు గుప్తాను టార్గెట్ చేశారు. తొలుత ఇంటికెళ్ళి బెదిరించినట్లు వార్తలు వచ్చాయి. తర్వాత ఓ లాడ్జిలో దాక్కున్న సుబ్బారావు గుప్తాపై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో కలకలం రేపింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా స్పందించారు. దాడి చేయబోతున్నారని తెలిసి తాను ఫోన్ లో వారించినట్లు మంత్రి వెల్లడించారు. కానీ అప్పటికే జరగాల్సిన దాడి జరిగిపోయింది. లాడ్జిలో దాడి సందర్భంగా సుబ్బారావు గుప్తా ఎంత వేడుకున్నా అక్కడకు వచ్చిన వైసీపీ కార్యకర్తలు దారుణంగా కొట్టిన విషయం వీడియోలో ఉంది. ఇది అంతా ఒకెత్తు అయితే మంగళవారం నాడు విజయవాడలో సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర జరిగిన కేక్ కటింగ్ ఉత్సవాల్లో పాల్గొని పరస్పరం కేక్ తిన్పించారు. ఇది చూసిన వారంతా నిన్న కొట్టారు..
ఇవాళ కేకు పెట్టారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. సుబ్బారావు గుప్తాపై దాడి అంశంపై కేసు నమోదు కావటంతో ఇరు వర్గాలు రాజీకి వచ్చినట్లు సమాచారం. అయితే మంగళవారం నాడు ఈ కేక్ కటింగ్ తర్వాత సుబ్బారావు గుప్తా చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు ఊతం ఇస్తున్నాయి. మంత్రి బాలినేని తనపై దాడి చేయించడం వార్తలను సుబ్బారావు గుప్తా ఖండించారు. సుభాని అనే వ్యక్తి ఓవరాక్షన్ వలనే ఈ రచ్చకు కారణం అని పేర్కొన్నారు. తాను మొదటి నుండి రాజకీయాలలో మంత్రి బాలినేని వెంటే ఉన్నానని, తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలు పార్టీలో ఉన్న పరిస్థితులను బట్టి చేశాను తప్ప తన వ్యాఖ్యల వెనుక ఎవరూ లేరన్నారు. పార్టీని బతికించుకోవాలనే ఆకాంక్షతో నేను ఆ వ్యాఖ్యలు చేశాను ఎటువంటి దురుద్దేశ్యం లేదని వివరణ ఇచ్చారు. మరో 29ఏళ్లపాటు సీఎం జగన్ సీఎం గా ఉండాలన్నారు. ఈ విషయాన్ని పెద్దది చేయకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.