Telugu Gateway
Andhra Pradesh

బీజేపీ దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే అంతా!

బీజేపీ దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే అంతా!
X

ఆంధ్ర ప్రదేశ్ లో ఏ మాత్రం బలం లేకపోయినా రాష్ట్రంపై పట్టు సాదించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం త్వరలో జరగనున్న ఎన్నికలను ఒక అవకాశంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే బీజేపీ పక్కా స్కెచ్ తోనే సుజనా చౌదరి ..సత్య కుమార్ లను ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బరిలోకి దింపిందా? అంటే అవుననే చెపుతున్నాయి ఢిల్లీ వర్గాలు. సుజనా చౌదరి లోక్ సభ బరిలో ఉండాలని కోరుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన అసెంబ్లీ పోటీలోకి వచ్చేశారు. కొద్ది రోజుల నుంచి సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ సీటు లో పోటీ చేస్తారు అనే ప్రచారం జరిగినా కూడా చాలా మంది ఈ విషయం అధికారిక ప్రకటన వచ్చే వరకు నమ్మలేదు. అయితే స్వయంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా నే సుజనా చౌదరి ని అసెంబ్లీ బరిలో ఉండాలని కోరినట్లు ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఏపీలో బీజేపీ కి కేటాయించిన పది అసెంబ్లీ సీట్లలో అందరి ఫోకస్ సుజనా చౌదరి, సత్యకుమార్ లపైనే ఉంది అనే చర్చ సాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో భవిష్యత్ లో చోటు చేసుకునే పరిణామాలు...ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబందించి దీర్ఘకాలిక లక్ష్యాలతోనే బీజేపీ ఈ ప్లాన్ వేసినట్లు ఆ పార్టీ నాయకులు చెపుతున్నారు. సుజనా చౌదరి, సత్య కుమార్ లు అధిష్టానం ప్లాన్స్ మంచిగా ఎగ్జిక్యూట్ చేస్తారు అనే నమ్మకంతోనే..చాలా ముందు చూపుతో ఈ పని చేశారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. సుజనా చౌదరి కి తెలుగు దేశం అధినేత చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఆయనకు టీడీపీ లో ఉన్న నేతలందరితో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి.

ఎందుకంటే ఆ పార్టీ లో ఆయన పలు సంవత్సరాల పాటు ఉన్న విషయం తెలిసిందే. అధిష్టానం చెప్పే పనులు పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయటంలో సత్య కుమార్ కు మంచి పేరు ఉంది అని పార్టీ నేతలు చెపుతున్నారు. ఈ కోణంలోనే భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆయన్ను కూడా అసెంబ్లీ బరిలో దించాలని నిర్ణయించి ధర్మవరం సీటు కేటాయించారు. ఇవి ఒకెత్తు అయితే బీజేపీ తో పొత్తు పెట్టుకున్న కారణంగా తెలుగు దేశం పార్టీ ఒంగోలు ఎంపీ సీటు విషయంలో కూడా నిర్ణయం తీసుకోవటానికి మల్లగుల్లాలు పడుతోంది. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో తాను కాకుండా తమ కుటుంబం నుంచి మాగుంట రాఘవ బరిలో ఉంటారు అని కొద్ది రోజుల క్రితం మాగుంట శ్రీనివాసుల రెడ్డి ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఉన్నారు అనే కారణం తో రాఘవ బదులు...మరో సారి మాగుంట శ్రీనివాసుల రెడ్డి కే సీటు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెపుతున్నారు. అంతే కాదు...టీడీపీ కి ఇప్పుడు రఘురామకృష్ణం రాజు సీటు కూడా రాజకీయంగా పెద్ద తలనొప్పిగా మారింది అని ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. బీజేపీ కాదన్న ఆయనకు తాము సీటు ఇస్తే బీజేపీ స్పందన ఎలా ఉంటుందో అన్న సంశయం ఆ పార్టీ అధిష్టానంలో ఉంది అనే చర్చ సాగుతోంది. ఆయనకు అసలు సీటు ఇస్తారా...ఇస్తే ఏది అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీ వచ్చినా కూడా ఆ పార్టీ ఎజెండా మాత్రం వేరే ఉంది అనే అనుమానాలు టీడీపీ నేతల్లో కూడా ఉన్నాయి. బీజేపీ నుంచి ఎదురయ్యే సవాళ్ళను టీడీపీ ఎలా అధిగమిస్తుందో చూడాల్సిందే.

Next Story
Share it