Telugu Gateway
Politics

పోతిరెడ్డిపాడు ఆపకపోతే..మేం అక్కడ బ్యారెజ్ కడతాం

పోతిరెడ్డిపాడు ఆపకపోతే..మేం అక్కడ బ్యారెజ్ కడతాం
X

రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జల వివాదాలపై మంగళవారం నాడు అత్యంత కీలకమైన అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, తెలుగు రాష్ట్రాల సీఎంలు కెసీఆర్, జగన్ లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ సీఎం కెసీఆర్ లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ గతంలోలాగా తన పద్ధతిని మార్చుకోకుండా కృష్ణానదిపై పోతిరెడ్డిపాడు తదితర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపకుంటే, తెలంగాణ ప్రభుత్వం కూడా అలంపూర్ - పెద్ద మరూర్ వద్ద బ్యారేజీ నిర్మించి తీరుతుందని, తద్వారా రోజుకు 3 టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసేవిధంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో చేసినట్లు తన ఇష్టం ఉన్నట్లు వ్యవహరిస్తే ఇకనుంచి కుదరదని, క్రమశిక్షణను ఉల్లంఘించి, తెలంగాణ నీటివాటాను కొల్లగొట్టాలని చూస్తే, తమ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తామూ సిద్ధమేనని ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కోల్పోయిన సాగునీటిని ప్రత్యేక రాష్ట్రంలో రాజ్యాంగ హక్కుగా పొంది తీరుతామని సీఎం స్పష్టం చేశారు. కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలని పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ఈదిశగా స్వయంగా కేంద్రమే స్పష్టమైన ఆదేశాలిచ్చినా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపీ కొనసాగించడం బాధాకరమన్నారు. ఆయకట్టు లేకుండా, నీటి కేటాయింపులు లేకుండా శ్రీశైలానికి గండిపెడుతూ నిర్మితమవుతున్న పోతిరెడ్డిపాడు కెనాల్ ను తెలంగాణ ఉద్యమకాలం నుంచే తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తున్నదని, అయినా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా పోతిరెడ్డి పాడును మరింత విస్తరించడాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు.

తెలంగాణకు హక్కుగా దక్కాల్సిన నదీ జలాల వివరాలను సోదాహరణంగా కేంద్రానికి వివరించి తమకు జరుగుతున్న అన్యాయాన్ని తక్షణమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ప్రారంభంలోనే, అనగా 2014 జులై 14న, అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956-సెక్షన్ 3 కింద ఫిర్యాదుల స్వీకరణకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తాము కేంద్రానికి లేఖ రాశామని, ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చేత, ఒక సంవత్సరం వేచిచూసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని సిఎం పేర్కొన్నారు. తక్షణమే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్నారు. కాగా, కేంద్రమంత్రి షెకావత్.. తెలంగాణ డిమాండ్ ను అంగీకరిస్తామంటూనే... సుప్రీంకోర్టులో తెలంగాణ పిటిషన్ వేసిఉన్న కారణంగా తాము ఎటువంటి చర్య తీసుకోలేక పోతున్నామన్నారు. దీనిపై తక్షణమే స్పందించిన సీఎం కేసీఆర్, కేంద్రం గనుక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తే.. సుప్రీం కోర్టులో కేసును వెనక్కి తీసుకోవడానికి తమకేమీ అభ్యంతరం లేదన్నారు.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 89 కింద కృష్ణా నదీ జలాల వివాద ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడిటి-2)కు ‘టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్’ ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు జరపాలని ముఖ్యమంత్రి కోరారు. అంతర బేసిన్లలోనే నదీ జలాలను తరలించాలనే జల న్యాయ సూత్రాన్ని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సమావేశం దృష్టికి తెచ్చారు. ‘‘ ఒక నదీ బేసిన్ లో ఉండే ప్రాంతాల అవసరాలు తీరినంకనే, ఇంకా అదనపు జలాలుంటేనే బేసిన్ అవతలికి నదీ జలాలను తరలించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి’’ అని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ జారీ చేసిన మార్గ నిర్దేశనాలను ఈ సందర్భంగా సిఎం వారికి వివరించారు. ఈ నేపథ్యంలో బేసిన్ అవతలికి కృష్ణా జలాలను తరలించే వీలు ఆంధ్ర ప్రదేశ్ కు లేదనీ, ఇదే విషయాన్ని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖతోపాటు కేఆర్ఎంబీ ఆంధ్రప్రదేశ్ కు స్పష్టం చేయడాన్ని సరైన చర్యగా సీఎం అభివర్ణించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వాదనతో కేంద్రమంత్రి కూడా ఏకీభవించారు. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులేవీ కొత్తవి కావని, ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్టుల నిర్మాణం మొదలైందని, తెలంగాణకు కేటాయించిన 967.94 టీఎంసీలకు లోబడే గోదావరి నదీమీద ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు.

డీపీఆర్ లు సమర్పించాలని కేంద్రమంత్రి కోరడం పట్ల సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. తెలంగాణలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులన్నీ బహిరంగమేననీ, ఇందులో రహస్యం ఏమీ లేదని, కాకపోతే నిర్మాణ క్రమానికి అనుగుణమైన స్వల్ప మార్పులు చోటు చేసుకుంటుండటం వలన డీపీఆర్ లు సమర్పించడంలో కొంత సమయం తీసుకోవాల్సి వస్తుందని, అంతేతప్ప డీపీఆర్ లు సమర్పించడానికి తమకు ఏ అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు. గోదావరి నదిపై, (జీడబ్లూడీటీ) అవార్డు ప్రకారం, నాటి ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవహిస్తున్న మొత్తం నీటిని వినియోగించుకోవచ్చని వుందని.. ఒకవేళ ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా ఏవైనా అభ్యంతరాలుంటే 1956 చట్టం కింద ట్రిబ్యునల్ కు నివేదించుకోవచ్చన్నారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి రెండు రాష్ట్రాలు కలిసి లేఖ ఇస్తే.. గోదావరి ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేస్తామన్నారు.

Next Story
Share it