Telugu Gateway
Andhra Pradesh

గోవా తరహాలో వైజాగ్ తీరంలో క్యాసినోలు!

గోవా తరహాలో వైజాగ్ తీరంలో క్యాసినోలు!
X

నిధుల లేమితో సతమతం అవుతున్న ఏపీ సర్కారు ఆంధ్రప్రదేశ్ లో క్యాసినోలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందా?. ఇందుకు గోవా మోడల్ ను ఫాలో అవ్వాలని నిర్ణయించిందా?. ‘లైవ్ మింట్’లో ఈ మేరకు ఓ కథనం ప్రచురించారు. గోవాలోని మండోవి నదిలో నడుపుతున్న తరహాలోనే రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు అనుమతించాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్లు పేర్కొన్నారు. కరోనా కారణంగా కేంద్రం కూడా జీఎస్టీ చెల్లింపుల్లో కోత విధించటం, ఇతర ఆదాయాలు తగ్గుముఖం పట్టడంతో ఏపీ సర్కారు ఈ అంశంపై ఫోకస్ పెట్టినట్లు ఇద్దరు సీనియర్ అధికారులు తెలిపినట్లు ఈ కథనంలో పేర్కొన్నారు.

ఏపీకి సుదీర్ఘతీర ప్రాంతం ఉన్న విషయం తెలిసిందే. విశాఖ తీరంలో క్యాసినోల ఏర్పాటు అంశంపై ముఖ్యమంత్రి కార్యాలయానికి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ప్రశ్నలను ఈ మెయిల్ ద్వారా పంపించగా..వార్త ప్రచురించే సమయానికి ఎలాంటి సమాధానం రాలేదని తెలిపారు. ఆదాయం కోసం తహతహలాడుతున్న ఏపీ సర్కారు ఈ ప్రతిపాదనను కేంద్రం ముందు పెట్టినట్లు అధికారులు తెలిపారు. జీఎస్టీ వచ్చిన తర్వాత రాష్ట్రాలు సొంతంగా వనరులు పెంచుకునేందుకు మార్గాలు పరిమితం అయిపోయాయి. ఇప్పటికే ఏపీ సర్కారు అదనపు ఆదాయాల కోసం పలు మార్గాలను అన్వేషిస్తోంది. మరి ఇందులో ఏ మేరకు నిజం ఉందో తేలాలంటే కొంత కాలం వేచిచూడాల్సిందే.

Next Story
Share it