Telugu Gateway
Andhra Pradesh

తెలంగాణ అందుకు అంగీకరించింది

తెలంగాణ అందుకు అంగీకరించింది
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం నాడు ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొని రాష్ట్ర వాదన విన్పించారు. అదే సమయంలో పలు అంశాలతో కూడిన లేఖను కూడా అందజేశారు. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా కొత్త నీటి నిల్వ సామర్ధ్యం, కొత్త ఆయకట్టు వచ్చి చేరటం లేదని తెలంగాణా గుర్తెరగాలన్నారు. రోజూ 3 టీఎంసీల మేర 299 టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచి ఎత్తిపోసేందుకు గతంలో తెలంగాణా కూడా అంగీకరించిందని సీఎం జగన్ వెల్లడించారు. ‘తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కోనే రాయలసీమ ప్రాంతంలోని నాలుగు జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు శ్రీశైలం ప్రాజెక్టు నీరు ఒక్కటే ఆధారం. తాగు, సాగునీటి అవసరాలతో పాటు పారిశ్రామిక అవసరాలకూ శ్రీశైలం ప్రాజెక్టుపైనే ఆధారపడాల్సి వస్తోంది. థార్ ఎడారి తర్వాత దేశంలోనే అతితక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా అనంతపురం ఉంది. ఏడారి అభివృద్ధి పథకం కూడా ఇక్కడ అమలు అవుతోంది. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలు కూడా దుర్భిక్ష ప్రాంతాల అభివృద్ధి పథకంలో భాగమై ఉన్నాయి.

వలసలు అధికంగా ఉన్న ఈ ప్రాంతాన్ని ఆర్ధికంగా అభివృద్ధి చేయాలంటే నీరు అత్యంత కీలకమైన వనరు అని ప్రభుత్వాలు గుర్తించాలి. తెలంగాణాలోని మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలు కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కోంటున్నాయి. ఈ జిల్లాలకు 142, 104 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో ప్రస్తుతం జిల్లాకు 50 టీఎంసీల నీటిని మాత్రమే ఇవ్వగలుగుతున్నాం. జిల్లాలో తాగు, సాగునీటి ఎద్దడిని తీర్చాలంటే కనీసంగా 100 టీఎంసీల నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. రాయలసీమలోని 4 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు కనీసంగా 600 టీఎంసీల నీటిని అందించాల్సి ఉంది. గత ఏడాది జూన్ 28 తేదీన జరిగిన సమావేశంలో తెలంగాణా ముఖ్యమంత్రి ఇవే అంశాలపై అంగీకారాన్ని తెలిపారు. శ్రీశైలంలో 854 అడుగుల కంటే ఎక్కువ నీటి నిల్వ ఉన్నప్పుడే 7 వేల క్యూసెక్కుల చొప్పున పోతిరెడ్డి పాడు ద్వారా రాయలసీమకు నీటిని తరలించగలం. 44 వేల క్యూసెక్కుల పూర్తి సామర్ధ్యంతో ఏడాదిలో 15 రోజుల పాటు మాత్రమే నీటిని రాయలసీమకు ఎత్తిపోసే అవకాశముంది.

కృష్ణా జలవివాదాల ట్రైబ్యునల్ తుది ఆదేశాల మేరకు చెన్నైకు 15 టీఎంసీలు, ఎస్ఆర్ బీసీ 19, కెసీ కెనాల్ 10 టీఎంసీల కేటాయింపు ఉంది. పునర్విభజన చట్టం ప్రకారం గాలేరు నగరికి 38, తెలుగుగంగకు 29, వెలిగొండకు 43.5, హంద్రీనీవా 40, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు 10, పైడిపాలెంకు 6, మైలవరం 7, సర్వారాయ సాగర్ కు 3, గోరుకల్లు 12.4, అవుకు 4.14, సోమశిల 78, కండలేరు 68 టీఎంసీల మేర శ్రీశైలం రిజర్వాయర్ పై ఆధారపడి ఉన్నాయి. దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టులు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వచ్చే నీటిపై ఆధారపడి ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణా 90 టీఎంసీల సామర్ద్యంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను, 30 టీఎంసీల ను ఎత్తిపోసేందుకు దిండి లిఫ్ట్, 40 టీఎంసీల వరకూ ఎత్తిపోసేందుకు కల్వకుర్తి లిఫ్ట్ ను కొత్తగా నిర్మించింది. తెలంగాణాలోని రంగారెడ్డి, మహబూబ్ నగర్ కంటే భౌగోళికంగా 98 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించిన రాయలసీమ ఆరు జిల్లాలకే శ్రీశైలం నుంచి నీటిని సరఫరా చేయటం ముఖ్యమని భావిస్తున్నా. సాగునీటి కోసమని 3 టీఎంసీలు, విద్యుత్ కోసమని 4 టీఎంసీల మేర తెలంగాణా ప్రతీ రోజూ శ్రీశైలం నుంచి వినియోగించుకునేందుకు సామర్ధ్యాలను పెంచుకుంది. ఈ పరిస్థితుల్లో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించి 3 టీఎంసీల మేర నీటిని శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఎత్తిపోయటం మినహా ఏపీకి మరో ప్రత్యామ్నాయం లేదు. భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులతో మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలతో పాటు ఖమ్మం, వరంగల్ జిల్లాల నీటి అవసరాలు తీర్చాలని తెలంగాణా భావిస్తోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల పర్యవేక్షణ సక్రమంగా జరిగేందుకు బోర్డు పరిధి కీలకమని ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. విభజన అనంతరం చేసిన ఏర్పాట్లు సరిగా లేవు, భౌగోళిక పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భౌగోళికంగా నాగార్జున సాగర్ కుడికాలువ హెడ్ రెగ్యులేటర్ ఏపీ పరిధిలో ఉన్నా ఇంకా తెలంగాణా దాన్ని నిర్వహించటం సరికాదని భావిస్తున్నాం. దీనిపై తెలంగాణా నియంత్రణ కారణంగా నీటి విడుదల అంశమై కేఆర్ఎంబీ ఉత్తర్వులు ఉన్నా నీటి వాటాను పొందలేని పరిస్థితి ఉంది. తక్షణమే నాగార్జున సాగర్ కుడికాలువ హెడ్ రెగ్యులేటర్ నియంత్రణ ఏపీకి మార్చాల్సి ఉంది. అలాగే విద్యుత్ ఉత్పత్తిని కూడా ఈ ఆరు జిల్లాలు, చెన్నై తాగునీటి అవసరాలు తీరాకే జరగాలని భావిస్తున్నాం. భౌగోళిక పరిధి విషయంలో గందరగోళం తలెత్తటం వల్ల కేఆర్ఎంబీ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. ఎనిమిదిన్నర జిల్లాల నీటి వినియోగానికి కీలకమైన శ్రీశైలం నాగార్జున సాగర్,రిజర్వాయర్ల నిర్వహణ, నియంత్రణ బాధ్యతల్ని ఏపీకి అప్పగించాలి.

బోర్డుకు స్పష్టమైన పరిధిని నిర్ధారించాలని కోరుతున్నాం. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఏపీకి తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంగా 811 టీఎంసీల నీటిలో ఏపీ వాటాగా 511 టీఎంసీలు, తెలంగాణా వాటాగా 299 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు సమ్మతి కుదిరింది. గోదావరి నదిపై కాళేశ్వరం, సీతారామ లిఫ్ట్ లాంటి కొత్త ప్రాజెక్టుల ద్వారా నీటిని వినియోగించుకుంటున్న తెలంగాణా పోలవరం ప్రాజెక్టు దిగువ నుంచి మళ్లిస్తున్న 80 టీఎంసీల్లోనూ వాటా అడగటం సహేతుకం కాదు. నూతనంగా నిర్మిస్తున్న వేర్వేరు ప్రాజెక్టుల ద్వారా తెలంగాణా వినియోగించుకునే గోదావరి జలాల వినియోగం 1335 టీఎంసీలకు పెరుగుతుంది. దిగువ రాష్ట్రంగా ఏపీ ప్రయోజనాలకు ఇది తీవ్రమైన ఇబ్బంది కలిగిస్తుంది. కేంద్ర జలసంఘం, గోదావరి నదీ యాజమాన్య బోర్డు అనుమతి ఉంటే తప్ప ప్రాజెక్టులపై ముందుకు వెళ్లకుండా తెలంగాణాను నిలువరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతం ప్రతీ ఏటా 1400 టీఎంసీల గోదావరి వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఏపీ సహా ఎగువన ఉన్న రాష్ట్రాలు వినియోగించుకోగా ఇంత మొత్తంలో నీరు సముద్రంలోకి వెళ్తోంది.’ అని పేర్కొన్నారు.

Next Story
Share it