Telugu Gateway
Andhra Pradesh

అంతర్వేది ఘటనలో చంద్రబాబు, లోకేష్ ల హస్తం

అంతర్వేది ఘటనలో చంద్రబాబు, లోకేష్ ల హస్తం
X

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం దగ్ధమైన ఘటన వెనుక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరుల హస్తం ఉందని ఆరోపించారు. చంద్రబాబు ప్రవాస అంద్రుడిలా హైదరాబాద్‌లో ఉంటూ రాష్ట్రంలో అలజడి సృష్టించాలనుకుంటున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరిందని, త్వరలోనే చినబాబు, పెదబాబు హస్తం బయటపడుతుందని అన్నారు. అంతర్వేదిలో గలాటా సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగాయని ప్రచారం చేయాలనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో గుంటూరు, హైదరాబాద్‌ వ్యక్తుల ప్రమేయాన్ని పోలీసులు గుర్తించారని తెలిపారు. శుక్రవారం విశాఖపట్నంలో జరిగిన ‘మన ఆరోగ్యం మన చేతుల్లోనే’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ప్రకటనతో ఇక్కడి భూములకు ధరలు పెరిగాయన్నారు.

భూ ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి ఘటనల్లో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు సీఎం ఆదేశించడం సంతోషకరమని వ్యాఖ్యనించారు. రాష్ట్రంలో మతాల పేరిట విధ్వంసం సృష్టించే యత్నం కొన్ని పార్టీలు చేస్తున్నాయని ఆరోపించారు. రాజధాని అంశం రాష్ట్రాల పరిధిలోనే ఉందని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు. చంద్రబాబు ట్రాప్‌లో పడి పవన్ కళ్యాణ్ అమరావతిపై ప్రేమ కనబరుస్తున్నారని అన్నారు. 13 జిల్లాల ప్రజలు కలిసి ఉండాలన్న ఉద్దేశంతోనే సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు ప్రతిపాదన చేసినట్టు చెప్పారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతూ జూమ్ ద్వారా ప్రజలలో చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు.

Next Story
Share it