Telugu Gateway
Politics

కంగనా రనౌత్ పై శివసేన ఎంపీ సంచలన వ్యాఖ్యలు

కంగనా రనౌత్ పై శివసేన ఎంపీ సంచలన వ్యాఖ్యలు
X

కంగనా రనౌత్. బాలీవుడ్ లో నిత్యం ఏదో ఒక వ్యాఖ్యలతో సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో కలకలం రేపాయి. బాలీవుడ్ లోని ప్రముఖులు చాలా మంది డ్రగ్స్ కు బానిసలే అని..టెస్ట్ లు చేస్తే ఈ విషయం తెలిసిపోతుందని పేర్కొంది. సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ప్రముఖుని ఇంట్లో జరిగే పార్టీలో కొకైన్ చాలా కామన్ అని తాజాగా ట్వీట్ చేసింది. గత కొన్ని రోజులుగా కంగనా నిత్యం వార్తల్లో ఉంటుంది. ఆమె చేసిన ఓ వ్యాఖ్యపై శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కంగనాను ఓ మెంటల్ కేసుగా అభివర్ణించారు. ముంబయ్ పోలీసులపై విశ్వాసం లేకుంటే నగరంలోకి రావద్దని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తనను బెదిరించారని కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలపై రౌత్ స్పందించారు.‘ఆమె ఓ మెంటల్‌ కేసు..తను తినే పళ్లెంలోనే ఉమ్మేసే రకం.. ఆమె వెనుక కొన్ని రాజకీయ పార్టీలున్నా’యని వ్యాఖ్యానించారు.

‘మేం ఎవరినీ బెదిరించబోము...ముంబయ్ నగరాన్ని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)తో పోల్చేవారికి పీఓకే గురించి ఏమీ తెలియదు..ముంబయ్, మహారాష్ట్రలను కించపరచడాన్ని తాము సహించ’మని సంజయ్‌ రౌత్‌ స్పష్టం చేశారు. 26/11 దాడుల సమయంలో ముంబై పోలీసులు వారి ప్రాణాలను పణంగా పెట్టి పౌరులను కాపాడారని, 1992 ముంబయ్ పేలుళ్లలోనూ నగరాన్ని, నగర ప్రజలను వారు కాపాడారని కొనియాడారు. కరోనా వైరస్‌తో పలువురు ముంబై పోలీసులు అధికారులు ప్రాణాలు కోల్పోయారని, రోగుల సేవలో పలు త్యాగాలు చేస్తున్నారని ప్రస్తుతించారు. సుశాంత్‌ మృతి కేసుకు సంబంధించి ముంబయ్ పోలీసుల దర్యాప్తుపై కంగనా రనౌత్‌ ప్రశ్నలు లేవనెత్తడాన్ని ప్రస్తావిస్తూ సంజయ్‌ రౌత్‌ చేసిన వ్యాఖ్యలపై కంగనా అభ్యంతరం తెలిపారు. ముంబయ్ పోలీసులపై నమ్మకం లేకపోతే నగరంలో అడుగుపెట్టరాదని సేన నేత తనను బెదిరించారని, ముంబయ్ ని చూస్తే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లా ఎందుకు కనిపిస్తోందని ఆమె ట్వీట్‌ చేశారు. ఇక్కడే ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది.

Next Story
Share it