రియా చక్రవర్తి అరెస్ట్
కీలక మలుపు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూర్ (ఎన్ సీబీ) అరెస్ట్ చేసింది. విచిత్రం ఏమిటంటే సీబీఐ, ఈడీలు కాకుండా ఎన్ సీబీ రియాను అదుపులోకి తీసుకోవటం. డ్రగ్స్ కేసులోనే ఆమెను అరెస్ట్ చేసినట్లు ఎన్సీబీ తెలిపింది. సాయంత్రం 4:30 గంటలకు రియాకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. డ్రగ్స్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాను ఎన్సీబీ నాలుగు రోజుల పాటు రియాను క్షుణ్ణంగా విచారించింది. విచారణలో ఆమె 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు వెల్లడించినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ మృతి చెందినప్పటి నుంచి పోలీసులు రియాను విచారిస్తున్నారు.
దీనిలో భాగంగానే డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. ఎన్సీబీ అధికారులు రియా సోదరుడు షోవిక్ను ఇప్పటికే అరెస్టు చేశారు. రియా సూచనల మేరకు సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడని షోవిక్ విచారణలో వెల్లడించాడు. ఆయన ఇచ్చిన వాగ్మూలం ఆధారంగానే ఎన్సీబీ విచారణ జరిపింది. ఈ క్రమంలోనే రియాకు చెందిన మొబైల్, ల్యాప్ట్యాప్ను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటినుంచి కీలక ఆధారాలను సేకరించారు. అలాగే డ్రగ్స్ స్మగ్లర్ బాసిత్ను ఐదు సార్లు కలిసినట్టు రియా అంగీకరించడంతో మంగళవారం అరెస్ట్ చేశారు. రియా డ్రగ్స్ కేసులో బాలీవుడ్కు సంబంధం ఉన్నట్లు చెప్పడంతో పరిశ్రమలోని ప్రముఖులకు కూడా త్వరలో ఎన్సీబీ సమాన్లు జారీ చేసే అవకాశం ఉంది.