Telugu Gateway
Politics

కెసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ

కెసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరారు. లేఖలోని ముఖ్యాంశాలు..తెలంగాణ విమోచన పోరాటం’ గురించి ప్రస్తుత, భావితరాలు తెలుసుకుని స్ఫూర్తి పొందాల్సిన అవసరముంది. దీనికోసం పూర్తిస్థాయిలో తెలంగాణ స్వాతంత్ర సమర యోధుల చరిత్రతో కూడిన ప్రత్యేక స్మారక స్ఫూర్తి కేంద్రం ఉండాలనేది.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష. దీనికి అనుగుణంగానే.. ఇటీవల నేను కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని కలిసి ఈ అంశం గురించి ప్రస్తావించినపుడు, తెలంగాణ విమోచన స్ఫూర్తి కేంద్రం ఏర్పాటుకు వారు సానుకూలంగా స్పందించి, కేంద్ర ప్రభుత్వం నుండి స్పూర్తి కేంద్రం నిర్మాణానికి కావలసిన నిధులు అందిస్తామని చెప్పారు. తెలంగాణ విమోచన పోరాట ఉద్యమం గురించి పూర్తి అవగాహన ఉన్న మీరు ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుతున్నాను.

ఈ స్ఫూర్తి కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన భూమిని కేటాయించాల్సిందిగా మనవి చేస్తున్నాను. హైదరాబాద్‌లో తెలంగాణ విమోచన అమరవీరుల ఉద్యమ స్పూర్తి కెంద్రానికి భూమి కేటాయిస్తే, ఒక అద్భుతమైన, ప్రేరణాత్మకమైన ‘తెలంగాణ విమోచన పోరాట స్ఫూర్తి కేంద్రం’ భావితరాలకు ఉపయోగపడే విధంగా ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు, తెలంగాణా ప్రాంతంలో నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాట చరిత్ర తెలిసిన ప్రముఖ వ్యక్తీగా ఈ స్మారక స్పూర్తి కేంద్రం ఏర్పాటుకు కావలసిన స్థలాన్ని వెంటనే కేటాయించి, నిర్మాణానికి వ్యక్తిగతంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని ఆశిస్తున్నాను. తెలంగాణ ప్రాంతానికి 1948 సెప్టెంబర్ 17న నిజమైన స్వాతంత్రం తెచ్చి పెట్టిందన్న విషయం జగద్విదితమే. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలు ఉన్నాయి. అలాగే తెలంగాణ విమోచన పోరాటం దేశ చరిత్రలోనే ప్రత్యేకమైనది, అత్యంత ముఖ్యమైనది. 1947 ఆగస్ట్ 15న దేశమంతా స్వేచ్ఛావాయువులు పీల్చినప్పటికీ నాటి నిజాం పాలనలో ఉన్న హైద్రాబాదు సంస్థానం ప్రస్తుత.. తెలంగాణలో మాత్రం నాడు మువ్వన్నెల జెండా ఎగరలేదని మీకు తెలుసు.’ అని పేర్కొన్నారు.

Next Story
Share it