సభలో ప్రజా సమస్యలు రాకుండా కెసీఆర్ కుట్ర
శాసనసభలో ప్రజా సమస్యలు రాకుండా ముఖ్యమంత్రి కెసీఆర్ కుట్ర పన్నారని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. సంఖ్యాబలం ఆధారంగా సమయం కేటాయిస్తామని చెబుతూ కాంగ్రెస్ కు ఆరు నిమిషాల సమయం ఇస్తే ప్రజా సమస్యలపై మాట్లాడటం సాధ్యం అవుతుందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనే కెసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తమకు ఇఛ్చిన ఆరు నిమిషాల్లో కూడా మొదలుపెట్టీ పెట్టకముందే స్పీకర్ బెల్లు కొట్టడం ప్రారంభిస్తున్నారని విమర్శించారు. మంగళవారం నాడు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మల్లు భట్టివిక్రమార్క గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడారు. సీఎల్పీ నేతతో పాటు ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీతక్క, తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకురావడంలో ప్రతిపక్షం పాత్ర కీలకమైందని అన్నారు. అటువంటి ప్రతిపక్షం గొంతు నొక్కి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా.. చేయడం దురదృష్టకరమని అన్నారు. సభలో ప్రతిపక్షంగా ఉన్నది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. ఎంఐఎం సభ్యులు ప్రభుత్వానికి సభలో మిత్రపక్షంగానే ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 19 మంది ఎమ్మెల్యేలను ఇచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించమని ప్రజలు చెప్పారని అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొని.. సంఖ్యాబలం లేదని చెప్పడం విడ్డూరమని అన్నారు.