Telugu Gateway
Andhra Pradesh

జగన్ కు నచ్చితే ఓకే..లేకపోతే రద్దులే

జగన్ కు నచ్చితే ఓకే..లేకపోతే రద్దులే
X

వైఎస్ హయంలో కెఎస్ఈజెడ్ ను వ్యతిరేకించిన చంద్రబాబు

చంద్రబాబు హయాంలో రైతులకు భూములిచ్చేయాలని సవాల్ చేసిన జగన్

అధికారంలోకి రాగానే పాత విషయాలను మర్చిపోతున్న నేతలు

కృష్ణపట్నం ఇన్ ఫ్రాటెక్ ఎస్ఈజెడ్ రద్దు..కెఎస్ఈజెడ్ అమ్మకానికి ఓకే

కృష్ణపట్నం ఇన్ ఫ్రాటెక్ ఎస్ఈజెడ్ కు భూములు ఇఛ్చింది దివంగత సీఎం రాజశేఖరరెడ్డే. కెఎస్ఈజెడ్ కు భూములు ఇచ్చింది రాజశేఖరరెడ్డే. రెండు ఎస్ ఈజెడ్ ల్లో పెద్దగా అభివృద్ధి జరగలేదు. ఇబ్బడిముబ్బడిగా కంపెనీలు ఏమీ రాలేదు. కానీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక కృష్ణపట్నం ఇన్ ఫ్రాటెక్ సెజ్ లో ఒప్పందం ప్రకారం ఎలాంటి అభివృద్ధి లేదని..సెజ్ కు జరిపిన భూ కేటాయింపులను రద్దు చేశారు. దీనిపై సంస్థ యాజమాన్యం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంది. సీన్ కట్ చేస్తే అదే కెఎస్ఈ జెడ్ లో కూడా సేమ్ సీన్. అక్కడా పెద్దగా అభివృద్ధి జరిగింది లేదు. కంపెనీలు వచ్చింది లేదు. కృష్ణపట్నం ఇన్ ఫ్రాటెక్ నవయుగా గ్రూపు ది. కెఎస్ఈజెడ్ జీఎంఆర్ గ్రూపుది. ప్రతిపక్షంలో ఉండగా భోగాపురం విమానాశ్రయంతోపాటు కెఎస్ఈజెడ్ లపై తీవ్ర విమర్శలు చేసిన జగన్ అధికారంలోకి రాగానే మాత్రం జీఎంఆర్ కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

తాము విమర్శలు చేసిన భోగాపురం ప్రాజెక్టును జీఎంఆర్ కే అప్పగించారు. ప్రతిపక్షంలో ఉండగా కాకినాడ ప్రత్యేక ఆర్ధిక మండలిలో భూములను రైతులకు వెనక్కి ఇచ్చేయాలని ఛాలెంజ్ చేసిన జగన్ ఇప్పుడు మాత్రం జీఎంఆర్ గ్రూపు రైతుల భూములతో దందా చేసుకోవటానికి అనుమతి ఇవ్వబోతున్నారు. కెఎస్ఈజెడ్ లో వాటా విక్రయానికి ప్రభుత్వ కూడా ఎన్ వోసీ ఇవ్వాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నయి. అయితే ఈ భూములు కొనుగోలు చేస్తున్న కంపెనీ అరబిందో రియాల్టీ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కావటం విశేషం. కెఎస్ఈజెడ్ భూముల్లోనే ఇప్పుడు కేంద్రం ప్రకటించిన బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ వ్యవహారాలు అన్నీ చూస్తుంటే అటు చంద్రబాబు అయినా..ఇటు జగన్ అయినా తమకు నచ్చితే ఓకే..లేదంటే వేటే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

2018 ఆగస్టులో జగన్ కాకినాడ ఎస్ఈజెడ్ భూములపై మాట్లాడిన వీడియో

https://www.youtube.com/watch?v=uBqkn6OycZ0

Next Story
Share it