Telugu Gateway
Politics

బాబ్రీ కూల్చివేత..పథకం ప్రకారం జరిగింది కాదు

బాబ్రీ కూల్చివేత..పథకం ప్రకారం జరిగింది కాదు
X

అద్వానీ..జోషీ ఉమాభారతి నిర్దోషులే

లక్నో సీబీఐ కోర్టు సంచలన తీర్పు

దేశంలో సంచలనం సృష్టించిన బాబ్రీ మసీదు విధ్యంసానికి సంబంధించి లక్నోలోని సీబీఐ కోర్టు బుధవారం నాడు సంచలన తీర్పు వెలువరించింది. మసీదు కూల్చివేత ముందస్తు వ్యూహం ప్రకారం చేసింది కాదని పేర్కొన్నారు. ఆ క్షణంలో క్షణికావేశంలో జరిగిన సంఘటనగా పేర్కొన్నారు. అదే సమయంలో బాబ్రీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు అందరినీ నిర్దోషులు ప్రకటించారు. బాబ్రీ విధ్వంసంలో నేతల పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. దీంతో బిజెపి అగ్రనేతలు అయిన ఎల్ కె అద్వానీ, ఉమా భారతి, మురళీ మనోహర్ జోషి తదితరులకు ఊరట లభించినట్లు అయింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మొత్తం 32 మందికి ఈ కేసు నుంచి విముక్తి కల్పించారు.

అద్వానీ, జోషి వంటి నేతలు కూల్చివేత సమయంలో అక్కడ గుమిగూడి కూల్చివేతకు దిగిన వారిని నియంత్రించేందుకు ప్రయత్నించారని ప్రత్యేక జడ్జీ యాదవ్ తెలిపారు. బాబ్రీ విధ్వంసం కేసుకు సంబంధించి లక్నో సీబీఐ కోర్టు జడ్జి ఎస్ కె యాదవ్ రెండు వేల పేజీలకుపైగా ఉన్న జడ్జిమెంట్ ను బుధవారం నాడు వెలువరించారు. ఈ తీర్పును పురస్కరించుకుని సున్నితమైన ప్రాంతాల్లో పోలీసు భద్రతను ముందు జాగ్రత్తగా పెంచారు. మీడియా కూడా పెద్ద ఎత్తున లక్నో కోర్టు వద్దకు చేరుకుని బుధవారం ఉదయం నుంచే హంగామా చేయటం ప్రారంబించాయి. .

బాబ్రీ కేసు పూర్వాపరాలు

అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగి 28 సంవత్సరాలు అయింది. 1992 డిసెంబర్ 6న ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే. అత్యంత కీలకమైన ఈ అంశానికి సంబంధించిన తీర్పు సెప్టెంబర్ 30న రానుంది. లక్నోలోని సీబీఐ కోర్టు ఈ క్రిమినల్ కేసుకు సంబంధించి తీర్పు బుధవారం నాడు వెలువరించనుంది. ముఖ్యంగా ఈ తీర్పుతో బిజెపికి చెందిన కీలకనేతలు అయిన ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి ల భవితవ్యం ఈ తీర్పుతో తేలనుంది. అందుకే బిజెపితో పాటు అందరిలో ఈ కేసు తీర్పుపై ఉత్కంఠ నెలకొని ఉంది. కేసు ట్రయల్ లో మొత్తం 32 మందిని విచారించారు. ఇందులో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ కూడా ఉన్నారు. బాబ్రీ కేసు విచారణ పూర్తయ్యేందుకు 28 సంవత్సరాలు పట్టింది అంటే ఇది ఎంత నత్తనడకన సాగిందో అర్ధం అవుతోంది. కేసు విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంది. ఈ మేరకు 2017 ఏప్రిల్ 19న రోజువారీగా ఈ కేసులో హియరింగ్ పూర్తి చేయాలని ఆదేశించింది. రాముడి పుట్టిన జన్మస్థలం అంటూ కొంత మంది ఆందోళనకారులు 1992లో అయోధ్యలోని బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.

చివరకు ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగి 2019 నవంబర్ లో సుప్రీంకోర్టు తీర్పుతో ఓ కొలిక్కి వచ్చిన విషయం తెలిసిందే. బాబ్రీ విధ్వంసంతో దేశ వ్యాప్తంగా మత ఘర్షణలు చోటుచేసుకుని ఏకంగా 1800 మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. బాబ్రీ విధ్వంసంపై మొత్తం రెండు ఎప్ఐఆర్ లు నమోదు కాగా తొలి ఎఫ్ఐఆర్ నెంబర్ 197/92గా ఉంది. ఇది గుర్తు తెలియని లక్షలాది మంది కరసేవకులపై పెట్టారు. రెండవ ఎఫ్ఐఆర్ 198/92లో ఎల్ కె అద్వానీ, మురళీమనోహర్ జోషి, ఉమా భారతి, వినయ్ కతియార్, విశ్వహిందూ పరిషత్ కు చెందిన అశోక్ సింఘాల్, గిరిరాజ్ కిషోర్, విష్ణు హరిదాల్మియా, సాద్వి రితంబరల పేర నమోదు అయింది. జర్నలిస్టులతోపాటు ఇతర దాడులకు సంబంధించి మొత్తం 47 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి.

Next Story
Share it