Telugu Gateway
Andhra Pradesh

ఏపీ మందు బాబులకు హైకోర్టు ఊరట

ఏపీ మందు బాబులకు హైకోర్టు ఊరట
X

ఆంధ్రప్రదేశ్ లో మందు బాబులకు హైకోర్టు ఊరటనిచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న జీవో 411 ప్రకారం రాష్ట్రంలోకి ఇతర ప్రాంతాల నుంచి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు హైకోర్టు బుధవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. జీవో 411 అమల్లో ఉన్నా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు మద్యం బాటిళ్ళు తెస్తే పోలీసులు కేసులు పెడుతున్నారు. దీంతో కొంత మంది మందు బాబులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు హైకోర్టు ఇతర రాష్ట్రాల నుండి మద్యం ని తీసుకుని వచ్చే వ్యక్తులకు వెసులుబాటు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు ప్రకారం ఎవరైనా ఇతర రాష్ట్రాల నుండి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకోవచ్చు.

ఈ తీర్పుతో మద్యం ప్రియులకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నుండి ఉపశమనం కలిగినట్లు అయింది. ఏపీలో ప్రస్తుతం కేవలం కొన్ని బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో మందుబాబులు గత కొంత కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం మళ్ళీ విధాన నిర్ణయాల్లో మార్పులు చేస్తే తప్ప వీటిని అడ్డుకోవటం సాధ్యం కాదు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీలోకి పెద్ద ఎత్తున అక్రమ మద్యం ప్రవేశిస్తోంది. తాజాగా హైకోర్టు తీర్పుతో సర్కారు ఖజానాకు నష్టం వాటిల్లటం ఖాయంగా కన్పిస్తోంది.

Next Story
Share it