Telugu Gateway
Politics

రాయలసీమ ఎత్తిపోతలపై సుప్రీంకు తెలంగాణా సర్కారు

రాయలసీమ ఎత్తిపోతలపై సుప్రీంకు తెలంగాణా సర్కారు
X

రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ తెలంగాణ సర్కారు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వాస్తవానికి ఇరు రాష్ట్రాల మధ్య ఏర్పడిన జల వివాదాలపై బుధవారం నాడు ఇద్దరు సీఎంలతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉన్నా...తెలంగాణ సీఎం కెసీఆర్ మాత్రం ఆగస్టు 20 తర్వాతే సమావేశం పెట్టాలన్నారు. దీంతో అపెక్స్ కమిటీ సమావేశం వాయిదా పడింది. ఈ లోగానే ఏపీ సర్కారు టెండర్లను ఖరారు చేసే అవకాశం ఉందని..ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కెసీఆర్ ల మధ్య రహస్య ఒప్పందం ఉందని..అందుకే అపెక్స్ కమిటీ సమావేశం కూడా వాయిదా వేయించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ దశలో తెలంగాణ సర్కారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సమైక్యరాష్ట్రంలోనే నదుల నీటివాటా విషయంలో తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, ఈ అంశాన్ని బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో స్పష్టంగా పేర్కొన్నారని సుప్రీంకోర్టుకు విన్నవించింది.

ఏపీ ప్రభుత్వం కొత్తగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులను, పిలిచిన టెండర్ల ప్రక్రియను తక్షణం రద్దు చేస్తూ స్టే ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. దీని ద్వారా తెలంగాణ ప్రజల న్యాయమైన హక్కులను కాపాడాలని సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం కొత్త ప్రాజెక్టు కిందకు వస్తుందని, ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం ఏపీ డీపీఆర్ లు సమర్పించాలి, విధిగా అనుమతులు పొందాలని పేర్కొన్నారు.

Next Story
Share it