రమేష్ ఆస్పత్రి..అన్నీ ఉల్లంఘనలే

హోటల్ స్వర్ణ ప్యాలెస్ ప్రమాదానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది. రమేష్ ఆస్పత్రి అన్ని రకాలుగా ప్రభుత్వ నియమాలను, నిబంధలను పూర్తిగా ఉల్లంఘించించిందని అందులో తేల్చింది. వైద్య విలువలను నీరుగార్చి.. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా చట్టాలను తుంగలో తొక్కి 10 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని స్పష్టం చేసింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జారీచేసిన అనుమతుల్లో నియమాలను ఉల్లంఘించి, కోవిడ్ అనుమానితులతో పాటుగా వైరస్ సోకని వారిని(నెగెటివ్ ఫలితం వచ్చినవారు) కూడా ఆస్పత్రిలో చేర్చుకున్నారని పేర్కొంది. ప్రభుత్వ అనుమతి రాకముందే.. హోటల్ స్వర్ణప్యాలెస్లో కోవిడ్ కేర్ సెంటర్ను ప్రారంభించినట్లు తేల్చిచెప్పింది.
సదరు హోటల్లో అగ్నిమాపక భద్రతా నియమాలు ఉన్నాయా? లేవా? అనేది చూసుకోకుండానే పేషెంట్లను తరలించిందని తెలిపింది. స్వర్ణప్యాలెస్ ఘటనపై కృష్ణా జేసీ, విజయవాడ సబ్కలెక్టర్, సీఎంహెచ్ఓ, రీజనల్ ఫైర్ ఆఫీసర్, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్లతో కూడిన విచారణ కమిటీ లోతుగా దర్యాప్తు జరిపింది. కోవిడ్ చికిత్స ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తూ.. అవసరం ఉన్నా, లేకున్నా ఖరీదైన రెమ్డెసివర్ అన్ని కేటగిరీల పేషెంట్లకూ వాడారు. ఎలాంటి అనుమతి లేకుండానే రమేశ్ ఆస్పత్రి ప్లాస్మా థెరఫీ నిర్వహించింది.హోటల్ స్వర్ణ ప్యాలెస్లో అగ్నిమాపక భద్రతా నియమాలు ఉన్నాయా? లేవా? అన్నది పరిశీలించకుండానే కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసిందని తెలిపారు.