డాక్టర్ రమేష్ కు హైకోర్టులో ఊరట

విజయవాడలోని రమేష్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ రమేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి ఆయన్నుఅరెస్ట్ చేసేందుకు ఏపీ సర్కారు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీని కోసం ఏపీ పోలీసులు ప్రత్యేక టీమ్ లను కూడా ఏర్పాటు చేశారు. అయితే అప్పటి నుంచి డాక్టర్ రమేష్ కన్పించకుండాపోయారు. హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు డాక్టర్ రమేష్పై దాఖలైన ఎఫ్ఐఆర్తో పాటు అరెస్ట్ వారెంట్పై స్టే విధించింది. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. డాక్టర్ రమేష్తో పాటు హాస్పిటల్ ఛైర్మన్పై తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
అసలు స్వర్ణ ప్యాలెస్ను క్వారంటైన్ సెంటర్గా అనుమతిచ్చిన కలెక్టర్, సబ్ కలెక్టర్, డీఎంహెచ్వోలకు ఎందుకు బాధ్యులను చేయలేదని ఈ సందర్భంగా ప్రశ్నించింది. కేసులో అధికారులను నిందితులకు చేరుస్తారా? అని ప్రశ్నించించింది. ఇందులో అధికారుల తప్పు కూడా ఉందని.. ఘటనకు వారు కూడా బాధ్యులేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఆగస్టు 9న విజయవాడలోని స్వర్ణప్యాలెస్లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్లో అగ్నిప్రమాదం జరగడంతో 10 మంది మరణించారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాద జరిగింది. ఆ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.