Telugu Gateway
Politics

పిలిచి అన్నం పెడితే..కెలికి కయ్యం పెట్టుకుంటారా?

పిలిచి అన్నం పెడితే..కెలికి కయ్యం పెట్టుకుంటారా?
X

ఏపీ తీరుపై తెలంగాణ సీఎం కెసీఆర్ వ్యాఖ్యలు

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై తెలంగాణ సీఎం కెసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిలిచి పీటేసి అన్నం పెడితే..కెలికి కయ్యం పెట్టుకుంటారా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అపెక్స్ కమిటీ ముందు తెలంగాణ వాదన గట్టిగా విన్పించాలని, ఈ విషయంలో కేంద్రంతోపాటు ఏపీ వైపు కూడా తప్పులు ఉన్నాయని అన్నారు. అపెక్స్ కమిటీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కెసీఆర్ సోమవారం నాడు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అందులో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నా అంతట నేనే ఆంధప్రదేశ్ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహ హస్తం అందించాము. బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని మన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పాం. సహజ సరిహద్దు రాష్ట్రాలు కాబట్టి స్నేహ పూర్వకంగా మెదిలి, అంతిమంగా రైతులకు సాగునీరు అందించే లక్ష్యం సాధించాలని ప్రతిపాదించాం.

వృధాగా సముద్రం పాలు అవుతన్న నీటిని రైతుల పొలాలకు మళ్లించే కార్యాచరణ అమలు చేద్దామని చెప్పాము. అయినా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కెలికి కయ్యం పెట్టుకుంటున్నది. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అర్థం లేని వాదనలతో, నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదు చేస్తున్నది. అపెక్స్ కమిటీ సమావేశంలో ఆంధప్రదేశ్ ప్రభుత్వం నోరు మూయించేలా, వారి అర్థ రహిత వాదనలను తిప్పికొట్టేలా సమాధానం చెపుతాం. తెలంగాణ ప్రాజెక్టుల గురించి మరోసారి నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కల్పిస్తాం’’ అని ముఖ్యమంత్రి కెసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్థం పర్థం లేని, నిరాధారమైన, అనవసర రాద్ధాంతం చేస్తున్నదని, కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంభిస్తున్నదని కె.చంద్రశేఖర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు ఆంధప్రదేశ్ ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి గట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదులు చేయడంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా తప్పిదమే. తెలంగాణ రాష్ట్రానికున్న నీటి వాటా ప్రకారమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికే నీటి కేటాయింపులు జరిగి, అనుమతులు పొంది, ఖర్చు కూడా జరిగిన ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఏమాత్రం సరికాదు’’ అని సిఎం అన్నారు. ‘‘శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే విషయంలో కూడా కేంద్రం అనవసరంగా అభ్యంతరం పెడుతున్నది. వాస్తవానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నింపిన తర్వాతనే మిగిలిన ప్రాజెక్టులు నింపాలి. అసలు శ్రీశైలం ప్రాజెక్టు నీటి పారుదల ప్రాజెక్టు కాదు, అది జల విద్యుత్ ప్రాజెక్టు. ఇన్ని వాస్తవాలు పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేయడం సమంజసం కాదు. ఒక రాష్ట్రంగా తెలంగాణకు కూడా హక్కులుంటాయి. తనకున్న హక్కు ప్రకారం ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఈ విషయంలో రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరించడం తగదు. కేంద్ర వైఖరిని కూడా యావత్ దేశానికి తెలిసేలా చేస్తాం. అన్ని వాస్తవాలు వెల్లడిస్తాం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్ చేసి కాళేశ్వరం, కంతనపల్లి ప్రాజెక్టును రీ డిజైన్ చేసి సమ్మక్క సాగర్, రాజీవ్ సాగర్ -ఇందిరా సాగర్ ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టు, దుమ్ముగూడెం ప్రాజెక్టును రీ డిజైన్ చేసి సీతమ్మ సాగర్ ను నిర్మిస్తున్నట్లు సిఎం వెల్లడించారు. పెన్ గంగ ప్రాజెక్టులకు 1975లోనే ఒప్పందం కుదిరి, ట్రిబ్యునల్ అవార్డు కూడా పూర్తయిందన్నారు.

ఈ ప్రాజెక్టులు ఎప్పుడు మంజూరయ్యాయి? ఏఏ అనుమతులు సాధించారు? తెలంగాణ వచ్చే నాటికే ఎంత ఖర్చు చేశారు? ఎంత భూమి సేకరించారు? విడుదల చేసిన జీవోలు.. తదితర వాస్తవాలను అపెక్స్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా బహిరంగ పరిచి ఫిర్యాదులు చేసిన వారికి, సందేహాలు వెలిబుచ్చిన వారికి తిరుగులేని సమాధానం చెప్పాలని సిఎం అధికారులను ఆదేశించారు. ‘‘గతంలో జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రలో చేపట్టిన ముచ్చుమర్రిని ప్రస్తావించింది. దీంతో ఈ రెండింటిని కొనసాగించాలనే నిర్ణయం జరిగింది. మళ్లీ ఆ అంశాన్ని లేవనెత్తడం సరికాదు. పాలమూరు – రంగారెడ్డి విషయంలో కూడా వాస్తవాలను మరోసారి వివరిస్తాం’’ అని సిఎం వెల్లడించారు.

Next Story
Share it