రఘురామకృష్ణంరాజు పులివేషంలో ఉన్న నక్క

నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంపీ పులివేషంలో ఉన్న నక్క అని విమర్శించారు. విశాఖపట్నంతో ఏ మాత్రం సంబంధం లేని ఆయన ఈ ప్రాంతానికి చెందిన అంశాలపై కేంద్రానికి లేఖ రాయటం ఏమిటని ప్రశ్నించారు. జగన్ బిక్షతో గెలిచిన రఘురామకృష్ణంరాజును హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. అమరావతిపై అంత ప్రేమ ఉంటే రాజీనామా చేయాలన్నారు.
వైసీపీకి ఉన్న 22 మంది ఎంపీల్లో ఒక ఎంపీని మైనస్ చేసుకున్నామని వ్యాఖ్యానించారు. తొట్లకొండ ఎక్కడుందో తెలియకుండా ఎలా మాట్లాడతారని రఘురామకృష్ణంరాజును ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర గురించి మాడ్లాడేటపుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. రాజుకు పలుకుబడుంటే నరసాపురం-కోటిపల్లి రైల్వేలైన్ కోసం ప్రయత్నించాలని సూచించారు. అనవసర విషయాలలో జోక్యం చేసుకోవద్దన్నారు.
ప్రభుత్వ ధనం వృధాగా ఖర్చు కాకూడదనే విశాఖలో స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. తిరుపతి, విశాఖ, విజయవాడలలో గెస్ట్ హౌస్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదించిందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, విశాఖపై అడుగడుగునా విషం చిమ్ముతున్న చంద్రబాబు.. ఆయన హయాంలో ఒక్క గెస్ట్ హౌస్ అయినా కట్టారా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రొటోకాల్ పేరుతో రూ. 23 కోట్లు దుర్వినియోగం చేశారని విమర్శించారు.