Telugu Gateway
Andhra Pradesh

నిబంధనల మేరకే టీటీడీ దర్శనాలు

నిబంధనల మేరకే టీటీడీ దర్శనాలు
X

కేంద్ర, రాష్ట్ర నిబంధనల ప్రకారం భక్తుల కోసమే తిరుమలలో దర్శనాలకు అనుమతిస్తున్నాం తప్ప..ఆదాయం కోసం కాదని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆదాయం కోసం తిరుమ‌లలో వేంక‌టేశ్వ‌ర స్వామివారి ద‌ర్శ‌నాలు చేయిస్తోంద‌ని, మీడియా, సోష‌ల్ మీడియా ద్వారా అనేక మంది చేస్తున్న విమ‌ర్శ‌ల్లో వాస్త‌వం లేద‌ని, తాము ఆదాయం కోసం ద‌ర్శ‌నాలు చేయించ‌డం లేద‌న్నారు. రోజుకు 12 వేల మందికి ద‌ర్శనం క‌ల్పించే ఏర్పాటు చేశామ‌న్నారు. తిరుప‌తిలో పాక్షిక లాక్‌డౌన్ కార‌ణంగా, తిరుప‌తిలో రోజుకు కేటాయిస్తున్న 3 వేల ఉచిత ద‌ర్శ‌న టోకెన్ల‌ను కొంత‌కాలంగా నిలిపివేసిన‌ట్టు చెప్పారు. దేశ‌వ్యాప్తంగా పెరుగుతున్న క‌రోనా కేసుల వ‌ల్ల కొన్ని రోజులు తిరుమ‌ల‌లో ద‌ర్శ‌నాలు చేసుకున్న‌వారి సంఖ్య త‌గ్గింద‌న్నారు. రెండు, మూడు రోజులుగా ద‌ర్శ‌నాలు చేసుకుంటున్న‌వారి సంఖ్య మళ్ళీ బాగా పెరిగింద‌ని తెలిపారు.

క‌రోనా బారిన‌ప‌డిన చాలామంది ఉద్యోగులు కోలుకుని విధుల‌కు హాజ‌ర‌వుతున్నార‌ని, మ‌రికొంత మంది చికిత్స‌లో ఉన్నార‌ని చెప్పారు. టిటిడి ఉద్యోగుల్లో మొత్తం 743 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. వీరిలో ఇప్ప‌టికే 402 మంది కోలుకున్నారు, 338 మంది చికిత్స పొందుతున్నారు, ముగ్గురు మృతి చెందారని తెలిపారు. క‌రోనా బారిన ప‌డిన ఉద్యోగులకు మెరుగైన వైద్య‌సేవ‌లు అందించేందుకు జెఇఓ స్థాయిలో ప్ర‌త్యేక ప‌ర్య‌వేక్ష‌ణ జ‌రుగుతోందన్నారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ను యాడ్‌ ఫ్రీ ఛానెల్‌గా మారుస్తున్నామని తెలిపారు. ఎస్వీబీసీ నిర్వహణకు ఏడాదికి రూ.3 కోట్ల నుండి రూ.4 కోట్ల వరకు వ్యయం అవుతోంది. ఈ క్రమంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్వీబీసీ ట్రస్టుకు మూడు వారాల వ్యవధిలోనే రూ.2.61 కోట్ల విరాళాలు అందాయని తెలిపారు.

Next Story
Share it