రమేష్ ఆస్పత్రి కోవిడ్ అనుమతి రద్దు
ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంతో ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక రాగానే సర్కారు చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా కోవిడ్ కేర్ సెంటర్లను నడుపుతున్నట్లు శుక్రవారం కమిటీ నివేదిక వెల్లడించింది. దీంతో రమేష్ ఆస్పత్రికి అనుమతిచ్చిన కోవిడ్ కేర్ సెంటర్లను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ రద్దు చేశారు. విజయవాడ ఎంజీ రోడ్లోని డాక్టర్ రమేష్ కార్డియాక్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్పత్రి మాత్రమే కోవిడ్ రోగుల చికిత్స కోసం గుర్తింపు పొందినట్లు తేల్చారు.
రమేష్ ఆస్పత్రి నియంత్రణలో ఉన్న హోటల్ స్వర్ణ ప్యాలెస్లో ఆగస్టు 8న అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో నిబంధనలకు వ్యతిరేకంగా కోవిడ్ కేర్ సెంటర్ను పెట్టినట్లు తేలింది. తాజాగా కోవిడ్ కేర్ సెంటర్గా రమేష్ ఆసుపత్రికి ఇచ్చిన గుర్తింపు రద్దు చేశామని కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. కరోనా పాజిటివ్ రోగులను చేర్చుకోవద్దని రమేష్ ఆసుపత్రిని ఆదేశించారు. ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు.