మూడు రాజధానులకు ఇది సమయం కాదు

ఏపీ ప్రభుత్వం ముందు ప్రజల ప్రాణాలను కాపాడటంపై దృష్టి సారించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల ఏర్పాటుకు ఇది సమయం కాదన్నారు. ప్రజలను కరోనా సమస్య పట్టిపీడిస్తున్న సమయంలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రజలను కాపాడటంపై దృష్టిపెట్టాలన్నారు. అమరావతిని అద్భుతమైన రాజధానిగా నిర్మించటానికి 33 వేల ఎకరాలు కావాలని ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారని తెలిపారు.
ఇంత భారీ రాజధానిని తర్వాత వచ్చే ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లకపోతే రైతుల పరిస్థితి ఏంటి అని మాట్లాడింది తానేనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం తెలిపినందున ఈ అంశంపై రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. రైతులకు ఏ విధమైన అండదండలు అందించాలో ఈ సమావేశంలో దృష్టిపెడతామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.