ఎల్జీ పాలిమర్స్ సీఈవో అరెస్ట్

ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై హై పవర్ కమిటీ నివేదిక ఇచ్చిన మరుసటి రోజే ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం కంపెనీ నిర్లక్ష్యమే అని కమిటీ తేల్చటంతో సర్కారు కొరడా ఝుళిపించింది. అందులో భాగంగానే ఈ గ్యాస్ లీకేజీ ఘటనలో మంగళవారం 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ఎల్జీ పాలిమర్స్ సీఈవో సున్కి జియాంగ్, డైరెక్టర్ డీఎస్ కిమ్, అడిషనల్ డైరెక్టర్ పీపీసీ మోహన్రావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఐపీసీ 304(2), 278, 284, 285, 337, 338, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ తుది నివేదికను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సమర్పించిన సంగతి తెలిసిందే. ఘటనకు సంబంధించి అనే కోణాల్లో అధ్యయనం చేసిన నీరబ్ కుమార్ నేతృత్వంలోని కమిటీ 4వేల పేజీల నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల స్టైరిన్ ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరిగి ప్రమాదానికి దారితీసిందని నివేదికలో కమిటీ పేర్కొంది.