Telugu Gateway
Politics

ప్రభుత్వ ఖర్చుతోనే సచివాలయంలో దేవాలయాలు

ప్రభుత్వ ఖర్చుతోనే సచివాలయంలో దేవాలయాలు
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ సచివాలయం దేవాలయాల అంశంపై స్పందించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం నాడు ఓ ప్రకటన చేశారు. కెసీఆర్ ప్రకటన సారాంశం.. ‘‘తెలంగాణ సెక్రటేరియట్ పాత భవనాలను కూల్చివేసి, కొత్త భవన సముదాయం నిర్మించడానికి ప్రభుత్వం పూనుకున్నది. ఈ క్రమంలో అక్కడున్న ఎత్తయిన భవనాలు కూల్చే సందర్భంలో పక్కనే ఉన్న ప్రార్థనా మందిరాలపైన శిథిలాలు పడి కొంత నష్టం జరిగిందనే విషయం నాకు తెలిసింది. ఇలా జరగడం పట్ల నేను ఎంతో బాధపడుతున్నాను. చింతిస్తున్నాను. ఇలా జరిగి ఉండాల్సింది కాదు. పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశ్యం తప్ప, ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగించడం ప్రభుత్వ ఉద్దేశం కాదు’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

‘‘ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలో, విశాలంగా ఎన్నికోట్లయినా వెనుకాడకుండా దేవాలయం, మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించి, వాటికి సంబంధించిన వ్యక్తులకు అప్పగిస్తాం. దేవాలయం, మసీదు నిర్వాహకులతో నేనే త్వరలోనే సమావేశమవుతాను. వారి అభిప్రాయాలు తీసుకుని, కొత్త సెక్రటేరియట్ భవన సముదాయంతో పాటుగా ప్రార్థనా మందిరాలను నిర్మించి ఇస్తామని హామీ ఇస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ‘‘తెలంగాణ రాష్ట్రం సెక్యులర్ రాష్ట్రం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లౌకిక స్పూర్తిని కొనసాగిస్తాం. ఇది కాకతాళీయంగా జరిగిన సంఘటన. దీన్ని అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలి’’ అని ముఖ్యమంత్రి కోరారు.

Next Story
Share it