Telugu Gateway
Politics

మన పాలన మనం చేసుకోవటం వల్లే ఈ ఫలితాలు

మన పాలన మనం చేసుకోవటం వల్లే ఈ ఫలితాలు
X

ముఖ్యమంత్రి కెసీఆర్ మరోసారి అదే మాట చెప్పారు. అవును తెలంగాణ ధనిక రాష్ట్రమే. గరీబోళ్ల రాష్ట్రం కాదు అని వ్యాఖ్యానించారు. ఆయన గురువారం నాడు మెదక్ జిల్లా నర్సాపూర్ లో హారిత హారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కెసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే పరిపాలన చేతకాదని అన్నారని..అప్పుడు ఉన్న విద్యుత్ సమస్య అసలు తెలంగాణ వచ్చాక ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. భవిష్యత్ లోనూ తెలంగాణలో విద్యుత్ సమస్య రాదన్నారు. రైతులు డిమాండ్ ఉన్న పంటలే వేయాలన్నారు. నియంత్రిత సాగుతో మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. మెదక్ జిల్లాపై కెసీఆర్ వరాల వర్షం కురిపించారు. మెదక్ జిల్లాలోని గ్రామాలకు 20 లక్షల రూపాయల లెక్కన, ఏడు మండల కేంద్రాలకు కోటి రూపాయల లెక్కన మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఏదైనా సమస్యలు వచ్చినా వేరే వాళ్లకు నిధులు ఆపుతున్నాం కానీ...గ్రామాల అవసరాలకు మాత్రం నిధులు ఆపటం లేదని చెప్పారు. లాక్‌డౌన్‌ సమయంలోనూ రైతులకు రైతుబంధు డబ్బులు ఇచ్చామని గుర్తుచేశారు. ఉద్యోగులకు, ఎమ్మెల్యేలకు జీతాలు ఆపి గ్రామాలకు డబ్బులు అందించామన్నారు. నర్సాపూర్ లో 15 కోట్లుతో నిర్మించిన అర్బన్‌ పార్కును సీఎం ప్రారంభించారు. పచ్చదనం పరిరక్షణ మనందరి బాధ్యత అన్నారు.

ప్రజాప్రతినిధులు పచ్చదనాన్ని పెంచేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. తెలంగాణ ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా మారిందన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) చెప్పింది. మన పాలన మనం చేయడం వల్లే ఈ ఫలితం వచ్చింది. మిషన్‌ భగీరథ నీళ్లు వస్తాయంటే ఎవరైనా నమ్మారా? కానీ వచ్చాయి. ఈ ఏడాదిలోనే సంగారెడ్డికి కాలేళ్వరం నీళ్లు వస్తాయి. ఇలా అన్ని సమస్యలను తీర్చుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. కలప స్మగ్లర్లకు సీఎం కేసీఆర్‌ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కలప దొంగతనం చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. ఇకపై కలప స్మగ్లర్లను దేశంలో ఎవడూ కాపాడలేడన్నారు. చీమ చిటుక్కుమన్నా తనకు సమాచారం వస్తుందని, వెంటనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Next Story
Share it