సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటా
న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులు అందుకున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు తాను అండగా ఉంటానని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఈ పోస్టులు పెట్టిన వారు వైసీపీ కావొచ్చు..ఇతరులు కావొచ్చన్నారు. కోర్టులను తాము తప్పుపట్టడం లేదని, న్యాయ వ్యవస్ధపై తమకు అపార నమ్మకం ఉందన్నారు. తప్పు చేసిన వారెవరైనా శిక్షించమనే చెబుతాం. టీడీపీ కవ్వింపులకే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు స్పందించి పోస్టులు పెట్టారు. విజయసాయిరెడ్డి సోమవారం నాడు మీడియాతో మాట్లాడారు. తన పేరుతో కూడా తప్పుడు ఐడీ సృష్టించి ఫేక్ అకౌంట్లో ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను విమర్సించినట్టుగా పోస్టు పెట్టారన్నారు. తనకు వైఎస్ కుటుంబానికి ఉన్న అనుబంధం విడదీయలేనిదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మద్య కొన్ని ప్రసార మాద్యమాలలో తాను ముఖ్యమంత్రి జగన్ కు దూరం అయినట్లు ప్రచారం చేస్తున్నారని...ఇందులో ఏ మాత్రం నిజంలేదన్నారు.
ముఖ్యమంత్రి జగన్ తోనే జీవితాంతం కొనసాగుతానని, కావాలని ఎవరో ప్రచారం చేస్తే నమ్మనక్కర్లేదని ఆయన అన్నారు. ఎస్ఈసీ వ్యవహారంలో కోర్టు జడ్జిమెంట్ను క్షుణ్ణంగా చదివి ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వానికి ఓ సూచన చేశారని వెల్లడించారు. అధికార పార్టీని గూండాలు, రౌడీలు అంటూ నిమ్మగడ్డ కేంద్రానికి లేఖ రాశారని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్మగడ్డే ఎన్నికల కమిషనర్గా ఉండాలని చంద్రబాబు ఎందుకు పట్టుపడుతున్నారు. రాజ్యాంగ వ్యవస్థల్ని చంద్రబాబు భ్రష్టు పట్టించారని విమర్శించారు. హైకోర్టు తీర్పువచ్చిన కొన్ని గంటల్లోనే టీడీపీ శ్రేణులు ఎందుకు సంబరాలు చేసుకున్నాయి. కోర్టు తీర్పు పూర్తిగా రాకుండానే నిమ్మగడ్డ తనకు తానే ఎస్ఈసీగా ఎలా నియమించుకుంటారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.