Telugu Gateway
Telangana

కరోనా నియంత్రణపై సర్కారుకు ఆసక్తి పోయింది

కరోనా నియంత్రణపై సర్కారుకు ఆసక్తి పోయింది
X

తెలంగాణలో కరోనా నియంత్రణపై ప్రభుత్వానికి ఉత్సాహం, ఆసక్తి పోయినట్లు కన్పిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజలు ఎవరు జాగ్రత్తలు వాళ్లే తీసుకోవాలన్న ధోరణిలో సర్కారు ఉందని అన్నారు. మీడియాకు విడుదల చేసే హెల్త్ బులెటిన్లలోనూ లెక్కలు గందరగోళంగా ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. వైద్య సిబ్బందికి తగిన కరోనా నివారణ కిట్లు ఇవ్వడం లేదన్న పిల్ పై హైకోర్టు బుధవారం నాడు విచారించింది. ఇప్పటివరకూ పీపీఈ కిట్లు, మాస్కులు ఎన్ని వచ్చాయి? సిబ్బందికి ఎన్ని ఇచ్చారో నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. రేపటి లోగా వివరాలివ్వాలని గాంధీ, నిమ్స్, ఫీవర్, కింగ్ కోఠి ఆస్పత్రుల సూపరింటెండెంట్ లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, గాంధీ సూపరింటెండెంట్ విచారణకు హాజరు కావాలని కోరింది.

గాంధీతో జూడాలు సమ్మె చేయడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోందన్న హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు పెంచాలని మూడు వారాలుగా ప్రభుత్వాన్ని కొరుతూనే ఉన్నామన్నారు. కరోనా చికిత్సలు గాంధీకే ఎందుకు పరిమితం చేశారు? నిమ్స్ వంటి ఆస్పత్రులను ఎందుకు వినియోగించడం లేదని ప్రశ్నించారు. తమ ఆదేశాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, తమ అసంతృప్తి మరింత కఠినంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటే.. అలాగే ఉంటామని హైకోర్టు వ్యాఖ్యానించింది. కంటైన్ మెంట్ ప్రాంతాల్లో ఇంటింటికీ పరీక్షలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. పరీక్షలు తక్కువ చేస్తే వైరస్ వ్యాప్తి ఎలా తెలుస్తుందని హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది.

Next Story
Share it