Telugu Gateway
Politics

కెసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

కెసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
X

కరోనా వైరస్ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించాలని అందులో డిమాండ్ చేశారు. కరోనా టెస్టులు పెంచాలని ఐసీఎంఆర్ చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. లేఖలోని ముఖ్యాంశాలు..‘ మీరు చేసే అంతంత మాత్రం టెస్టుల్లోనే రాష్ట్రంలో 32.1 శాతం మేరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా ఏ స్థాయిలో కారాళ నృత్యం చేస్తోందో ఈ పర్సెంటేజీలే నిదర్శనం. లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం కాంగ్రెస్ ఎంపీలకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం వెనుక మీ ఒత్తిడి ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య వ్యవస్థలను సమీకృతం చేసి కరోనాను ఎదుర్కునే ప్రణాళిక రచించాలి. కరోనా విషయంలో మీరు మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీఐపీల ప్రాణాలకు ఇస్తోన్న విలువ పేద-మధ్యతరగతికి ఇవ్వడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడం కంటే స్మశానానికి వెళ్లడం మేలు అన్న నిశ్చితాభిప్రాయానికి ప్రజలు వస్తున్నారు. సీతక్క సలహా ఇస్తే అసెంబ్లీ సాక్షిగా ఎగతాళి చేశారు. పారాసిటమల్ వేసుకుంటే చాలని ప్రజలను తప్పుదోవపట్టించారు. ఉడుకు నీళ్లు తాగితే కరోనా పోతుందని మంత్రులు కూడా బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేశారు.

పరిస్థితులు అనుకూలంగా ఉంటే మీడియా ముందుకు రావడం... ప్రతికూలంగా ఉంటే మొఖం చాటేయడం మీకు అలవాటుగా మారింది. నాలుగు కోట్ల మంది ప్రజలకు గాంధీ ఆసుపత్రి ఒక్కటే దిక్కయ్యే దుస్థితి కల్పించారు. టిమ్స్ ఆసుపత్రి విషయంలో హడావుడే తప్ప ప్రారంభానికి ఎందుకు నోచుకోవడం లేదు. తమపై ఒత్తిడి పెరుగుతోందని గాంధీ వైద్యులు రోడెక్కినా పట్టించుకున్న నాథుడు లేడు. ట్రేస్, టెస్ట్, ట్రీట్ విధానాన్ని అనుసరించమని మొదటి నుంచి మొత్తుకుంటున్నా మీ చెవికెక్కడం లేదు. కరోనా లెక్కల విషయంలో హైకోర్టును కూడా మీరు తప్పుదోవపట్టించారు. వైద్య శాఖనే సమర్ధంగా నిర్వహించలేని మీరు సీఎంగా ఎలా పని కొస్తారు. మీ అతి తెలివి పక్కన పెట్టి ఇప్పటికైనా నిపుణులతో కమిటీ వేయండి. అఖిలపక్షాన్ని పిలిచి ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో సలహాలు, సూచనలు తీసుకోండి’. అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Next Story
Share it