కరోనా వెనక్కి లాగింది..అయినా పరిగెడదాం
లాక్ డౌన్ నుంచి అన్ లాక్ మోడ్ లోకి వచ్చామని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు.ఓ వైపు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూనే మరో వైపు ఆర్ధిక వ్యవస్థలో పునరుత్తేజం నింపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీర్ఘకాలంలో దేశానికి మేలు చేసేలా, ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టేలా కేంద్రం సన్నాహాలు చేస్తుందన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)125 వార్షికోత్సవ సమావేశంలో పారిశ్రామికవేత్తల నుద్దేశించి మోడీ ప్రసగించారు.
ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేలా మేడిన్ ఇండియా ఉత్పత్తులను తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు.ముందస్తు లాక్డౌన్తో మనం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఎంఎస్ఎంఈలు నిలదొక్కుకునేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఉపాథి అవకాశాలు పెంచేందుకు సంస్కరణలు అవసరమని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ సత్వరం కోలుకునేలా చూడాలని ఆర్థిక వ్యవస్థ బలోపేతమే తమ ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు.ఈ సమస్యలు తాత్కాలికమే అని...భవిష్యత్ లో భారత్ పలు రంగాల్లో పురోగతి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు పారిశ్రామికవేత్తలు తమ వంతు సహకారం అందించాలని కోరారు.