విజయవాడలో మళ్ళీ లాక్ డౌన్..రద్దు
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులతో ఎంపిక చేసిన ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఈనెల 26 నుంచి వారం రోజుల పాటు విజయవాడలో లాక్ డౌన్ అమలు చేయనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రకటించారు. అత్యవసర వస్తువులు, మెడికల్ షాప్స్ కు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలు వారం రోజులు పాటు బయట తిరగరాదన్నారు.
బుధ, గురు వారాల్లో ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. కరోనా వ్యాప్తి నియంత్రణ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు కూడా వారం రోజులు పాటు లాక్ డౌన్ ని పాటించాలని కోరారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా వైరస్ వ్యాప్తి చెందుతోందని తెలిపారు. లాక్ డౌన్ కు సంబంధించి కలెక్టర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. కానీ అరగంటలోనే తూచ్...లాక్ డౌన్ లేదంటూ మరో ప్రకటన వెలువడింది. ఇదంతా గందరగోళ వ్యవహారంగా మారింది.