నిమ్మగడ్డ తీర్పుపై సుప్రీంకెళ్తాం
ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ సర్కారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్..ఆ తర్వాత జారీ చేసిన జీవోలను రద్దు చేసింది. ఈ వ్యవహారంపై వైసీపీ స్పందించింది. పక్షపాతంగా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రమేష్ను తీసివేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని తెలిపారు. కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే గౌరవిస్తామని అన్నారు. అదే సమయంలో తాము ఈ అంశంపై సుప్రీంకోర్టుకు అప్పీల్ కు వెళ్తామని..ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "నెల రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషన్పై ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయగా ఈసీ నిమ్మగడ్డ రమేష్ పదవిని కోల్పోయాడు. ఆయన స్థానంలో జస్టిస్ కనగరాజ్ నియయాకం జరిగింది. దీనిపై హైకోర్టుకు వెళ్ళారు.
ఈ క్రమంలో ప్రభుత్వ ఆర్డినెన్స్ జీవోలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే ఒక్కో సమయంలో న్యాయం జరగకపోవచ్చు. అలాంటప్పుడు పై కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. దానిపై న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నా"మని తెలిపారు. కోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే రాజీనామా చేయాలా అని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో చాలాసార్లు కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ అధికారాలు ఏమిటో ప్రభుత్వానికి తెలుసన్నారు. ప్రభుత్వానికి పరిమిత అధికారాలు ఎలా ఉంటాయో మిగతా వ్యవస్థలకు పరిమితికి లోబడి అధికారాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. రాజ్యాంగానికి లోబడే అన్ని వ్యవస్థలు పని చేయాలని అంబటి పేర్కొన్నారు.