ఆందోళనలో ఉన్న ప్రజలను ఆదుకోండి
రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ మండలి, పర్యవేక్షణ విభాగాలు సరిగా పని చేయడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అందుకే ఇలాంటి దుర్ఘటనలు సంభవిస్తున్నాయని అన్నారు. గతంలో కూడా విశాఖ ప్రజలు కాలుష్య సమస్యలను తన దృష్టికి తెచ్చారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మరింత పకడ్భందీగా నగరంలో కాలుష్య పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పవన్ కళ్యాణ్ గురువారం నాడు విశాఖపట్నంలోని ఎల్ జీ పాలిమర్స్ లో జరిగిన ఘటనపై జిల్లాకు చెందిన నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సహకారం అందించాలని పవన్ జిల్లా నేతలకు సూచించారు. ఈ దుర్ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు... వారందరికి ధైర్యం చెప్పాలని జనసేన నాయకులు, శ్రేణులను కోరారు. “ఇలాంటి సమయంలో మనం రాజకీయాలు గురించి మాట్లాడకూడదు. విష వాయువుల ప్రభావంతో ఆందోళనలో ఉన్న ప్రజలను సాధారణ స్థితికి తెచ్చేందుకు అవసరమైన చర్యల్లో పాల్గొనడం మన బాధ్యత. విశాఖపట్నం ప్రాంత జనసేన నాయకులు, శ్రేణులు స్పందించిన విధానం అభినందనీయం.
భయకంపితులైన ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకురావడంలో యంత్రాంగానికి సేవలు చేశారు. ఇదే రీతిలో ఈ ఘటన తాలూకు బాధితులకు అండగా నిలవాలి. పారిశ్రామికీకరణకు, అభివృద్ధికీ ఎప్పుడూ వ్యతిరేకం కాదు. అయితే పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వాటి పరిరక్షణకు సంబంధించిన నిబంధనలు పారిశ్రామికీకరణలో భాగంగా ఉన్నాయి. వాటిని అమలు చేయడంలో, సేఫ్టీ ఆడిట్ విషయంలో శ్రద్ధ చూపడం లేదు.’ అన్నారు. రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “విశాఖ పరిధిలోని వెంకటాపురంలోని ఎల్ జి పాలిమర్స్ నుంచి విష వాయువులు విడుదలైన ఘటన దురదృష్టకరం. ఆ ప్రాంతంలో నివసిస్తున్నవారు ఆ ప్రభావంతో పడుతున్న ఆరోగ్యపరమైన ఇబ్బందులు బాధాకరంగా ఉన్నాయని అన్నారు. విశాఖ జిల్లా నేతలు అక్కడి పరిస్థితిని వివరించారు.