ఔటర్ రింగు రోడ్డుపై వాహనాలకు అనుమతి
రాష్ట్రంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు తొలగించిన తెలంగాణ సర్కారు తాజాగా ఔటర్ రింగు రోడ్డుపై వాహనాలకు అనుమతి మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి 21వ తేదీ నుంచి ఓఆర్ఆర్పై వాహనాల రాకపోకలను అనుమతించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ), హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లి.(హెచ్జీసీఎల్) నిర్ణయించాయి. అయితే కర్ఫ్యూ అమల్లో ఉండే వేళల్లో మాత్రం వాహనాలను అనుమతించరు. ప్రజా ఆరోగ్య రక్షణ చర్యల్లో భాగంగా ఓఆర్ఆర్పై టోల్గేట్ నిర్వహణ సిబ్బంది భద్రతా చర్యలు పాటించాలని ఆదేశించారు.
ఓఆర్ఆర్ టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్ టాగ్ నిబందనలు పాటించాల్సి ఉంటుంది. డిజిటల్ పేమెంట్ పద్ధతిలో ఫాస్ట్ టాగ్ చెల్లింపులకు అవకాశం ఉంటుంది. వాహనదారులు వీలైనంత మేరకు నగదు రహిత లావాదేవీలకు ముందుకు రావాలని హెచ్ఎండీఏ సూచించింది. ఓఆర్ఆర్పై ప్రయాణించే సరకు రవాణా వాహనాల(గూడ్స్ వెహికిల్స్)లో ప్రయాణీకులున్నట్లుగా టోల్ ప్లాజా సిబ్బంది గుర్తించిన స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందజేయాలని సిబ్బందిని హెచ్ఎండీఏ అధికారులు ఆదేశించారు.