Telugu Gateway
Telangana

ధాన్యం సేకరణలో తెలంగాణ రికార్డు

ధాన్యం సేకరణలో తెలంగాణ రికార్డు
X

వరిసాగు, ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం కొత్త రికార్డును నమోదు చేసింది. దేశం నిర్దేశించుకున్న ధాన్య సేకరణ లక్ష్యంలో తెలంగాణ వాటానే సింహభాగం ఉండటం విశేషం. దేశానికి కావాల్సిన ఆహారం అందించడంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని భారత ఆహార సంస్థ (ఎఫ్ సీఐ) సిఎండి డివి ప్రసాద్ ప్రకటించారు. 2020 యాసంగిలో తాము సేకరించిన మొత్తం ధాన్యంలో 63 శాతం కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచి, మిగతా అన్ని రాష్ట్రాల నుంచి కలిపి 37 శాతం సేకరించినట్లు డివి ప్రసాద్ శుక్రవారం ప్రకటించారు. కరోనా నేపథ్యంలో ఎదురైన అనేక సవాళ్లను అధిగమించి ఈ సారి ప్రభుత్వ రంగ సంస్థలు రికార్డు స్థాయి కొనుగోళ్లు జరిపాయని చెప్పారు.

దేశ వ్యాప్తంగా ఎఫ్.సి.ఐ. ఈ యాసంగిలో ఇప్పటిదాకా 83.01 లక్షల టన్నులు సేకరించగా, అందులో తెలంగాణ రాష్ట్రం నుంచే 52.23 లక్షల టన్నులు సేకరించినట్లు తెలిపారు. ఈ సారి ఎఫ్.సి.ఐ. 91.07 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, అందులో సగానికి పైగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం సమకూర్చిందని అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ యాసంగిలో ఎక్కువ వరి పంట పండినందున అది, దేశ అవసరాలకు ఎంతగానో ఉపయోగపడిందని ఎఫ్.సి.ఐ. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఎఫ్ సీఐ ప్రకటనపై మంత్రి కెటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇది తెలంగాణ రైతులకు గర్వకారణం అని పేర్కొన్నారు. ఈ అద్భుతమైన రికార్డు చేరుకోవటంలో ముఖ్యమంత్రి కెసీఆర్ విజన్ కూడా ఉందన్నారు.

Next Story
Share it