Telugu Gateway
Andhra Pradesh

టీడీపీ ఓ జూమ్ పార్టీలా మారింది

టీడీపీ ఓ జూమ్ పార్టీలా మారింది
X

తెలుగుదేశం పార్టీపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఓ జూమ్ పార్టీలా మారిందని ఎద్దేవా చేశారు. మహానాడును జూమ్ యాప్ లో నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించిన విషయం తెలిసిందే. పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం కూడా చంద్రబాబు ఇదే తరహాలో నిర్వహించారు. సీఎం జగన్ ఆదేశాలతో విశాఖ గ్యాస్ లీక్ బాధితులందరికి పరిహారం అందించామని చెప్పారు. ఆస్పత్రుల్లో బాధితులందరికీ వైద్యం అందేలా జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు. రెండు రోజులుగా బాధిత గ్రామాల్లో సాధారణ పరిస్థితి ఉందన్నారు.

ఎవరికీ సమస్యలు రాకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పారు. మరో రెండు రోజుల్లో మిగిలిన వారికి కూడా పరిహారం అందిస్తామన్నారు. ఎల్జీ పాలిమర్స్‌ ఘటనలో ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతుంటే.. ఒక్క టీడీపీ నేత కూడా సహాయం చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవస్థలను చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై హైపవర్‌ కమిటీ నియమించామని, నివేదిక వచ్చిన తర్వాత తగిన నిర్ణయాలు తీసుకుంటామని బొత్స తెలిపారు.

Next Story
Share it