Telugu Gateway
Andhra Pradesh

ఏకస్వామ్య ప్రభుత్వం అంటే చెల్లదు

ఏకస్వామ్య ప్రభుత్వం అంటే చెల్లదు
X

ఎస్ఈసీ రమేష్ కుమార్ అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరిపోసిందని అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన వ్యవస్థలను ప్రభుత్వాలు తమకు నచ్చిన విధంగా మార్చుకోవాలని చూస్తే న్యాయ విభాగాలు రక్షిస్తాయి అనే విషయాన్ని రాష్ట్ర హైకోర్టు తీర్పు ద్వారా మరోమారు నిరూపించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తిరిగి కొనసాగించాలనే తీర్పును తక్షణమే అంగీకరించి- రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించాలని కోరారు. ఆయన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభీష్టానికి భిన్నంగా వెళ్లారనే కారణంతోనే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ఆ రోజు ఆయన ఎన్నికల కమిషనర్ హోదాలో కరోనా విపత్తు ఎంత ప్రమాదకరమైనదో గ్రహించి ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేశారు.

అప్పుడు ముఖ్యమంత్రి స్పందించిన తీరుని ప్రజాస్వామ్యవాదులెవరూ హర్షించలేదు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న అధికారిపై ముఖ్యమంత్రితోపాటు, అధికార పక్షంవాళ్లు చేసిన వ్యాఖ్యలు వారి ధోరణిని వెల్లడించాయి. రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పని చేయడం, నిర్ణయాలు తీసుకోవడం అవసరం అని ప్రభుత్వం ఈ తీర్పు ద్వారా తెలుసుకోవాలి. ఏకస్వామ్య ప్రభుత్వంగానో, నియంతృత్వ ధోరణితోనో పాలన సాగిస్తే న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజాస్వామ్యానికి రక్షణ లభిస్తుందని గ్రహించాలి. అధికార యంత్రాంగం కూడా పాలకులకు రాజ్యాంగం గురించీ, చట్టం గురించీ అవగాహన కల్పించాలి. లేదంటే న్యాయ స్థానాల ముందు జవాబు చెప్పుకోవాల్సింది అధికార యంత్రాంగమే అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

Next Story
Share it