Telugu Gateway
Politics

సోనియా వ్యాఖ్యలకు బిజెపి కౌంటర్

సోనియా వ్యాఖ్యలకు బిజెపి కౌంటర్
X

వలస కూలీల రైల్వే ఛార్జీలను తమ పార్టీ భరిస్తుందని ప్రకటించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై బిజెపి తీవ్ర విమర్శలు చేసింది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు భారత్ ను కరోనా విషయంలో ఇటలీ చేద్దామనుకుంటున్నారా? అంటూ ఆ పార్టీ ఘాటు వ్యాఖ్యలు చేసింది. వలస కూలీల నుంచి ప్రభుత్వం ఎలాంటి చార్జీలు వసూలు చేయటంలేదని బీజేపీ నేతలు పేర్కొన్నారు. వలస కూలీల తరలింపు వ్యయంలో 85 శాతం రైల్వేలే భరించాయని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్రా స్పష్టం చేశారు. ఘనమైన ప్రకటనలు నిస్తేజంలో ఉన్న విపక్ష శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు ఉపకరించినా ప్రజలకు సాయం అందడం ముఖ్యమని, ప్రభుత్వం పూర్తి బాధ్యతతో అవసరార్ధులకు సాయం అందేలా చర్యలు చేపడుతోందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.

వలస కూలీలకు ఉచిత రైలు ప్రయాణం కల్పించడం లేదని, గుజరాత్‌లో ట్రంప్‌ కార్యక్రమానికి మాత్రం రూ 100 కోట్లు వెచ్చించారని సోనియా గాంధీ విమర్శించిన నేపథ్యంలో పాలక పార్టీ ఈ మేరకు స్పందించింది. కాంగ్రెస్‌ అధినేత్రి మాటలకు క్షేత్రస్ధాయిలో పరిస్థితికి పోలిక లేదని, వలస కూలీల తరలింపుకైన వ్యయంలో రైల్వేలు 85 శాతం ఖర్చును చెల్లించాయని, కాంగ్రెస్‌ పార్టీ ఆ డబ్బు చెల్లించేందుకు బదులు రాజకీయాలకు పాల్పడకుండా తమ పార్టీ పాలిత రాష్ట్రాలు మిగిలిన 15 శాతం తమ వాటాను చెల్లించేలా వ్యవహరిస్తే మేలని బీజేపీ హితవు పలికింది. అయితే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా 50 రూపాయలు టిక్కెట్ పై చెల్లించాలని..ఆ మొత్తం రాష్ట్రాలే భరించాలని మీడియా సమావేశంలో తెలిపారు.

Next Story
Share it