ఒక్కో రైతు ఖాతాలో 5500 రూపాయలు

రైతు భరోసా కింద ఏపీ సర్కారు మరో విడత 2800 కోట్ల రూపాయలను రైతుల ఖాతాకు బదిలీ చేసింది. ఒక్కో రైతుకు ఈ దఫా 5500 రూపాయలు అందనున్నాయి. 49,43,590కిపైగా రైతు కుటుంబాలకు శుక్రవారం నాడు ఈ మొత్తం వారి ఖాతాల్లో జమ అయింది. గత నెలలో రూ.2 వేల చొప్పున రూ. 875 కోట్లు జమ చేసింది. ఏపీలో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కానున్నందున మే 30నన రాష్ట్రంలో 10,641 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించనున్నారు. ఈ కేంద్రాల్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంటాయి. రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ శాఖ సిబ్బంది అందుబాటులో ఉంటారని సీఎం జగన్ తెలిపారు. వ్యవసాయానికి సంబంధించిన సలహాలను ఆర్బీకే ద్వారా అందిస్తాం. భూసార పరీక్షలు కూడా రైతు భరోసా కేంద్రాల నుంచే చేస్తాం. రైతు భరోసా కేంద్రంలో 3 రకాల ల్యాబ్లను కూడా అందుబాటులోకి తెస్తాం. జిల్లా, నియోజకవర్గ, రైతు భరోసా కేంద్రాల్లో ల్యాబ్లు ఉంటాయి. ఈ-క్రాపింగ్ ద్వారా పంట రుణాలను ఇప్పించేలా చర్యలు తీసుకుంటాం. గిట్టుబాటు ధర కల్పించడంలో కూడా ఆర్బీకేలు కీలక పాత్ర పోషిస్తాయి.
జగన్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు భరోసా అంశంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, రైతులతో మాట్లాడారు. రైతులు, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు ఎంత చేసినా తక్కువే అని జగన్ వ్యాఖ్యానించారు. వ్యవసాయానికి పెట్టుబడి కోసం రైతులు ఇబ్బంది పడకూడదని, పెట్టుబడి సాయం అందించేందుకే రైతు భరోసా కింద రూ.13500 ఏటా అందిస్తున్నాని స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో రూ. 12500 చొప్పున నాలుగేళ్లు ఇస్తామని చెప్పినా.. రూ.13,500 చొప్పున ఐదేళ్లపాటు ఇస్తామని ప్రకటించారు.‘గతేడాది రూ.6350 కోట్లు రైతు భరోసా కింద చెల్లించాం. రైతు భరోసా కింద రూ.5500 నగదు రైతుల అకౌంట్లో జమ అవుతాయి.
ఏప్రిల్లో 2వేలు ఇచ్చాం.. ఇప్పుడు రూ.5500 ఇస్తున్నాం. కౌలు రైతులు, అటవీ భూములు, అసైన్డ్ భూములు సాగు చేస్తున్నవారికి రూ.7500 అందజేస్తాం. అక్టోబర్లో 4వేలు, వచ్చే సంక్రాంతికి మరో 2వేలు అందజేస్తాం. రైతు భరోసా కింద మొత్తం రూ.13,500 రైతులకు అందిస్తాం. పార్టీలకతీతంగా రైతులందరికీ పెట్టుబడి సాయం అందిస్తున్నాం. గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా ఉంచుతున్నాం. ఎవరైనా పేరు లేకపోతే నమోదు చేయించుకునే అవకాశం కల్పించాం. రైతులకు మేలు చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. నగదు బదిలీ కాకుంటే 1902 కాల్ సెంటర్కు రైతులు ఫోన్ చేయొచ్చు’ అని తెలిపారు.