Telugu Gateway
Andhra Pradesh

ఈ సంక్షోభ సమయంలో కక్ష సాధింపులా?

ఈ సంక్షోభ సమయంలో కక్ష సాధింపులా?
X

ఏపీలోని వైసీపీ సర్కారు తీరు ను జనసేన తప్పుపట్టింది. సంక్షోభ సమయంలో ప్రజలు కష్టాలు తీర్చటం కంటే సర్కారు కక్ష సాధింపులపైనే దృష్టి పెట్టడం ఏ మాత్రం సరికాదని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ప్రజా సమస్యలను తెలిపినా, ప్రభుత్వం వైఫల్యాలపై మాట్లాడినా ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో కేసులుపెడుతోంది... ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా పని చేయాలని అన్నారు. శనివారం సాయంత్రం మనోహర్ పార్టీ ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, ముఖ్య నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని పరిస్థితిపై నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో ప్రజలకు పార్టీ తరఫున అందించాల్సిన భరోసా, రెడ్ జోన్లో ఉన్నవారికి అండగా నిలవడం, ప్రజా సమస్యలు, రైతాంగం పరిస్థితి, చేనేత రంగంపై ఆధారపడ్డ వారు చేతివృత్తుల వారు పరిస్థితి, ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కోవిడ్-19 వల్ల ఉత్పన్నమైన విపత్కర పరిస్థితుల్లో రాజకీయాల కంటే ప్రజలకు బాసటగా నిలవడమే ముఖ్యం అని స్పష్టంగా చెప్పారు.

ఈ మాటను మన నాయకులు, శ్రేణులు అనుసరిస్తున్నారు. లాక్ డౌన్ మూలంగా పేద వర్గాలు ఎన్నో ఇబ్బందులుపడుతున్నాయి. రైతులు తమ పంటలు అమ్ముకోలేకపోతున్నారు. అకాల వర్షాలతో మరింత నష్టపోయారు. చేతి వృత్తులవారు ఉపాధి కోల్పోయారు. చేనేత రంగంపై ఆధారపడి రెండున్నర లక్షల కుటుంబాలు ఉన్నాయి. వారికీ పని లేకుండా పోయింది. ఇలా ప్రతి వర్గం సమస్యలను ఎదుర్కొంటోంది. మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా చేసే నిర్మాణాత్మక విమర్శను పాలకులు గ్రహించాలి. ఇష్టానుసారం కేసులు పెట్టడం సరికాదు. ఇలాంటి సమయంలో రాజకీయాలే ప్రధానం అనేలా కక్ష సాధింపుతో వ్యవహరించడం తగదు.

కర్నూలులో కరోనా వ్యాప్తి రోజురోజుకీ పెరిగిపోతుంటే - పార్టీ అధికార ప్రతినిధిపై ఎఫ్.ఐ.ఆర్. ఉంది అంటూ అక్కడి పోలీసులు హైదరాబాద్ వచ్చారు. అంటే ప్రభుత్వం ధోరణి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. కరోనా భయపెడుతున్నా ఎంతో బాధ్యతతో వైద్య, పోలీస్, రెవెన్యూ, మునిసిపల్… ఇలా పలు శాఖల ఉద్యోగులు ముందుకు వెళ్లి సేవలు చేస్తుంటే వారి జీతాల్లో కోతలు విధించింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే పెన్షన్ మీద ఆధారపడ్డ వారికీ కోత వేశారు. ఇళ్ల స్థలాలకు భూముల సేకరణ పేరుతో సాగిస్తున్న వ్యవహారాలు, ఇసుక అక్రమ రవాణా విషయాలు మన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దృష్టికి చేరాయి. రాజధాని రైతులకు రావాల్సిన వార్షిక కౌలు, భూమిలేని పేదలకి పెన్షన్లలో జాప్యంపై స్పందించారు. ప్రతి సమస్యపై జనసేన గళం వినిపిస్తుంది” అన్నారు.

Next Story
Share it