Telugu Gateway
Telangana

ఎంత మందికైనా కరోనా పరీక్షలు చేస్తాం

ఎంత  మందికైనా కరోనా పరీక్షలు చేస్తాం
X

తెలంగాణ రాష్ట్రంలో ఎంత మందికైనా కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రకటించారు. వైరస్ సోకిన వారికి చికిత్స అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వసిద్ధంగా ఉందన్నారు. ఆయన బుధవారం నాడు ప్రగతి భవన్ లో కరోనా అంశంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 20 వరకు తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ యథావిథిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 553 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు, చికిత్స పొందుతున్న వారిలో బుధవారం ఎనిమిది మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని, మరో 128 మంది గురువారం డిశ్చార్జి కానున్నారని వివరించారు. ‘‘కరోనా వైరస్ సోకిన వారి ఆధారంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 259 కంటైన్మెంట్లు ఏర్పాటు చేసి, పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. వైరస్ వ్యాప్తి జరగకుండా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంతమందికైనా సరే, వైరస్ నిర్థారిత పరీక్షలు నిర్వహించడానికి కావాల్సిన టెస్ట్ కిట్స్ సిద్ధంగా ఉన్నాయి.

రాష్ట్రంలో పిపిఈ కిట్లకు ఏమాత్రం కొరతలేదు. ఇప్పటికే 2.25 లక్షల పిపిఈ కిట్లు ఉన్నాయి. ఈ సంఖ్య కొద్ది రోజుల్లోనే 5 లక్షలకు చేరుకుంటుంది. మరో 5 లక్షల పిపిఇ కిట్లకు ఆర్డర్ ఇచ్చాం. మొత్తంగా తెలంగాణ రాష్ట్రం 10 లక్షల పిపిఇ కిట్లను కలిగి ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3.25 లక్షల ఎన్ 95 మాస్కులున్నాయి. త్వరలోనే ఈ సంఖ్య 5 లక్షలకు చేరుకంటుంది. మరో 5 లక్షలకు ఆర్డర్ ఇచ్చాం. దీంతో తెలంగాణలో 10 లక్షల ఎన్ 95 మాస్కులు అందుబాటులో ఉంటాయి. వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, ఆసుపత్రులు, బెడ్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. 20 వేల బెడ్స్ ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. లక్ష మంది పేషెంట్లు అయినా సరే, చికిత్స చేయడానికి అవసరమైన ఏర్పాట్లు ప్రభుత్వం చేసి పెట్టింది.

కరోనాపై యుద్ధానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రతీ పేద కుటుంబానికి 1500 చొప్పున నగదు అందించాలనే నిర్ణయం మేరకు బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేశాం. ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం అందే కార్యక్రమం దాదాపు పూర్తయింది. మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రకటించిన ముఖ్యమంత్రి ప్రత్యేక నగదు ప్రోత్సాహం, వైద్య సిబ్బందికి ప్రకటించిన 10 శాతం అదనపు వేతనం కూడా వారికి అందింది. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యం కార్యక్రమాలు నిరంతరరాయంగా జరగాల్సి ఉన్నందున రాష్ట్రంలోని గ్రామ పంచాయతీకు ఏప్రిల్ నెల కోసం రూ.308 కోట్లు , అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు కలిపి రూ. 148 కోట్లు విడుదల చేశాం’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు.

Next Story
Share it