క్వారంటైన్ లోకి సీఎం భద్రతా సిబ్బంది
కరోనా ఇప్పుడు ప్రపంచంలో అందరినీ వణికిస్తోంది. తాజాగా సీఎం భద్రతా సిబ్బంది టీ తాగిన ఫలితం వారంతా క్వారంటైన్ లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఆ టీ షాప్ కూడా సీఎం నివాసానికి అతి దగ్గరలోనే ఉంటుంది. దీంతో వెంటనే పారిశుధ్య సిబ్బంది కూడా రంగంలోకి దిగి మరిన్ని చర్యలు ప్రారంభించారు. ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా?. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం వద్ద జరిగింది ఈ వ్యవహారం. మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భద్రతా సిబ్బందికి టీ అందించిన వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో సీఎంకు సెక్యూరిటీగా ఉన్న 170 మంది పోలీసులు, ఇతర అధికారులు క్వారంటైన్లోకి వెళ్లారు. సీఎం నివాసభవనమున్న మాతో శ్రీ సమీపంలో ఓ చాయ్ వాలాకి కరోనా వైరస్ సోకింది. లాక్డౌన్ కంటే ముందు సీఎం భద్రతా సిబ్బంది అంతా అతని స్టాల్ వద్దే టీ తాగారు. దీంతో వారంతా ముందు జాగ్రత్తగా స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. ముంబైలోని బాంద్రా ఈస్ట్ లోని ఉత్తర భారతీయ సంఘ్ భవనంలో వారిని నిర్బంధించినట్లు అధికారులు తెలిపారు.
సీఎం నివాస ప్రాంతం సమీపంలో కరోనా పాజిటివ్ తేలడంతో ముంబై మన్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. సీఎం నివాసమున్న ప్రాంతాన్ని కరోనా నియంత్రణ జోన్ గా ప్రకటించారు. ముఖ్యమంత్రి నివాసం చుట్టుపక్కల మున్సిపల్ అధికారులు ప్రత్యేకంగా స్ప్రేయింగ్ చేశారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే గత కొద్ది రోజులుగా భద్రతా సిబ్బంతో సామాజిక దూరాన్ని పాటిస్తున్నారని అధికారులు వెల్లడించారు. తన కారును కూడా తానే డ్రైవింగ్ చేసుకుంటూ పలు కార్యక్రమాలను హాజరయ్యారని తెలిపారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 748 మందికి కరోనా వైరస్ సోకింది. 45 మంది మరణించారు.