Telugu Gateway
Andhra Pradesh

రైతులను ఆదుకోవాలి

రైతులను ఆదుకోవాలి
X

ఓ వైపు గిట్టు బాటు ధర సమస్య. మరో వైపు అకాల వర్షాలతో నష్టం. ఇలా రకరకాల కారణాలతో ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ అన్ని ప్రాంతాల్లో వరి, మొక్క జొన్న, ఉద్యాన పంటలు వేసిన రైతులకు కన్నీరే మిగిలిందన్నారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించి పెట్టుబడి రాయితీని అందించాలని కోరారు. ‘ధాన్యం కల్లం మీద ఉంది. అలాగే ఇప్పటికీ పలు ప్రాంతాల్లో కోతలు నడుస్తున్నాయి. వెన్ను విరిగి పంట నీట మునిగిపోయింది. ఇలా దెబ్బ తిన్న వరి రైతులకు ప్రభుత్వం తగిన ఉపశమన పథకాలు అమలు చేయాలి. రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలి.

ఇతర ప్రాంతాల నుంచి ధాన్యం రావడంతో స్థానిక రైతులకు మద్దతు ధర రావడం లేదు. అలా ధాన్యం రాకుండా కట్టడి చేయడం తక్షణావసరం. మామిడి రైతుల ఆశలను ఓ వైపు కరోనా దెబ్బ తీస్తే ఇప్పుడు అకాల వర్షాలు మరోసారి దెబ్బ తీశాయి. మామిడితోపాటు అరటి, ఇతర పండ్ల తోటల రైతులను, కూరగాయలు సాగు చేస్తున్నవారిని ఆదుకోవాలి. రైతుల నుంచి వసూలు చేసే నీటి తీరువాను రెట్టింపు చేయాలనే ప్రతిపాదన సరికాదు. గిట్టుబాటు ధరలు లేక, మార్కెట్ సదుపాయం లేకపోవడంతో రైతులు కష్టాల్లో ఉంటే నీటి తీరువాను పెంచాలనుకోవడం భావ్యం కాదు. పెంపు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తున్నాను.’ అని పేర్కొన్నారు.

Next Story
Share it