Telugu Gateway
Andhra Pradesh

కరోనా చిన్నపాటి జ్వరం కాదు

కరోనా చిన్నపాటి జ్వరం కాదు
X

కరోనా చిన్నపాటి జ్వరం అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోసిపుచ్చారు. ఆయన జగన్ పేరు ప్రస్తావించకుండానే మెడికల్ జర్నల్స్..అధ్యయన పత్రాలు చెబుతున్న అంశాల గురించి వివరించారు. కరోనా వైరస్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. కరోనా వైరస్ చూపిస్తున్న దుష్ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ తర్జనభర్జనలు పడుతున్నాయని పేర్కొన్నారు. కరోనా విషయంలో అందరం అప్రమత్తంగా ఉండాల్సిందే అని తెలిపారు. మంగళవారం నాడు పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా జనసేన నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఉభయ గోదావరి జిల్లా పార్టీ బాధ్యులు, పి.ఏ.సి. సభ్యులు కె.నాగబాబు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “కరోనాను నియంత్రించే ఔషధం వచ్చే వరకూ సమస్య ఉంటుంది.

ప్రపంచ దేశాల అధినేతలందరూ ఎలా బయటపడాలా అనే ఆలోచిస్తున్నారు. మన దేశ పరిస్థితుల్లో ఈ మహమ్మారిని తట్టుకోవడం కష్టమే. 100 పడకలు ఉన్న చోటకు 500మంది రోగులు వస్తే నియంత్రించలేము. కరోనా సమస్యను పక్కదోవ పట్టించేందుకో, దృష్టి మరల్చాలనో వివాదాస్పద ప్రకటనలు చేస్తూ ఉంటారు. అలాంటి వాటిని ఎవరూ పట్టించుకోవద్దు. సమస్య ఏమిటి? ఎలా పరిష్కరిస్తున్నారు అనే విషయం మీదే దృష్టిపెట్టాలి. జనసేన నాయకులు, శ్రేణులు ఎవరూ సంయమనం కోల్పోవద్దు. నిర్మాణాత్మకంగానే మాట్లాడదాం. మనపై చేసే వివాదాస్పద ప్రకటనలు, విమర్శలకు తగిన సమయంలో సమాధానం ఇద్దాం. ఇప్పుడు మన కర్తవ్యం అంతా సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచి వారికి సహాయ సహకారాలు అందించడమే.

పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “లాక్ డౌన్ సమయంలో ప్రజలకు జననసైనికులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమైనవి. ఇది రాజకీయాలకు సమయం కాదు. ప్రజలకు ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయసహకారాలు అందుతున్నాయో లేదో పరిశీలించండి. లోటుపాట్లపై స్పందించి సమస్య పరిష్కారమే ప్రధానంగా పని చేద్దాం. పశ్చిమ గోదావరి జిలాల్లో అకాల వర్షాల వల్ల వరి, వాణిజ్య పంటలు, ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయి. లాక్ డౌన్ తో ఆక్వా రంగం నష్టపోతోందని జిల్లా నాయకులు మన అధ్యక్షులవారి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలపై సోషల్ మీడియా, మీడియా ద్వారా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నారు” అన్నారు.

Next Story
Share it