అత్యవసర ప్రయాణానికి ఏపీలో పాస్ లు

కరోనా లాక్ డౌన్ సందర్భంగా చాలా మంది అత్యవసర అవసరాలకు కూడా బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని..అలాంటి సమయంలో తాము అవసరం ఉన్న వారికి ప్రత్యేక పాస్ లు జారీ చేస్తామని పోలీసులు ప్రకటించారు. రాష్ట్ర ప్రజలు అందరూ లాక్ డౌన్ ను పకడ్బందీగా పాటిస్తున్నారని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా వైద్యం, స్వచ్ఛంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవల కోసం వెళ్లే కొంతమంది ఇబ్బందులు పడుతున్నారని.. అలాంటివారికోసం కోవిడ్-19 అత్యవసర రవాణా పాసులు అందిస్తామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు పాసుల జారీకి అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొంది. అత్యవసర కారణాలను చూపి ప్రజలు ఈ పాసులు పొందొచ్చని వెల్లడించింది. పాసులు కావాలనుకునేవారు.. 1.పేరు, పూర్తి చిరునామా, 2.ఆధార్ కార్డు వివరాలు, 3.ప్రయాణించే వాహనం నెంబర్, ప్రయాణికుల సంఖ్య..ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాలనే పూర్తి వివరాలు సమర్పించాలి. అన్ని పత్రాలను పరిశీలించిన తరువాత సాద్యమైనంత త్వరగా సంబంధిత పోలీసు అధికారులు పాసులు జారీచేస్తారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది.