Telugu Gateway
Andhra Pradesh

ఏపీ సర్కారుకు షాక్

ఏపీ సర్కారుకు షాక్
X

ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి జీవోలను కొట్టేసిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళ ప్రతిపాదనకు హైకోర్టు బ్రేకులు వేసింది. రాష్ట్రమంతటా తప్పనిసరి ఇంగ్లీష్ మీడియం చేయాలని సర్కారు ఎంతో పట్టుదలగా పేరెంట్స్ కమిటీల నుంచి ..వివిధ వర్గాల ప్రజల నుంచి సంతకాలు సేకరించినా ప్రయోజనం లేకుండా పోయింది. బుధవారం నాడు ఏపీ హైకోర్టు ఏపీ సర్కారు జారీ చేసిన జీవోలు 81, 85ను కొట్టేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఈ రెండు జీవోలను సవాల్ చేస్తూ ఏలూరుకు చెందిన డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది.

ఏ మీడియం చదువుకోవాలి అనేది పిల్లలు, వారి తల్లిదండ్రులు నిర్ణయిస్తారని ప్రభుత్వ జీఓను సవాలు చేస్తూ న్యాయవాది ఇంద్రనీల్ సైతం పిల్ దాఖలు చేశారు. ఇంగ్లీష్ మీడియంను తప్పనిసరి చేస్తే కొందరి బ్యాక్ లాగ్‌లు మిగిలిపోయే ప్రమాదం ఉందని న్యాయవాది పేర్కొన్నారు. దీనిపై ఇటీవల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన 81, 85 జీఓలను కొట్టేస్తూ హైకోర్టు నేడు తీర్పునిచ్చింది. ప్రభుత్వం మాత్రం ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్ధులు అందరితో పోటీ పడాలంటే ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అంటూ వాదిస్తూ వచ్చింది.

Next Story
Share it