ఏపీ వైద్య శాఖ మంత్రి పేషీని తాకిన కరోనా

ఏపీ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని పేషీకి కరోనా వైరస్ తాకింది. ఆయన పేషీలో పనిచేసే ఆఫీస్ సబార్డినేట్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రే వెల్లడించారు. దీంతో తనతో సహా పేషీలో ఉన్న 13 మంది పరీక్షలు చేయించుకున్నామని..అందరికీ నెగిటివ్ వచ్చిందని తెలిపారు. ఏపీలో రెండు లక్షల మంది వలస కూలీలు ఉన్నారని మంత్రి వెల్లడించారు. వేరే రాష్ట్రాల్లో ఉన్న ఏపీ ప్రజలను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఆయన బుధవారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆస్పత్రుల సంఖ్యను పెంచి, మెరుగైన సదుపాయాలు కల్పించామని అన్నారు. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారన్నారు.
టెలీమెడిసిన్ అమలవుతున్న తీరుపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారని, లాక్ డౌన్ సమయంలో టెలీమెడిసిన్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారని చెప్పారు. కుటుంబ సమగ్ర సర్వేలో గుర్తించిన ప్రతి ఒక్కరికీ.. వెంటనే వైద్య పరీక్షలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. అవసరం మేరకు వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని భర్తీ చేస్తున్నామని పేర్కొన్నారు. లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏపీ వాళ్లందరినీ వెనక్కి తీసుకొచ్చే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఖచ్చితంగా ఓపీ సేవలు అందించాలని గతంలోనే ఆదేశించామన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు ఓపీ సేవలు అందించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.