Telugu Gateway
Andhra Pradesh

ఎన్నికల ప్రక్రియను మళ్ళీ కొత్తగా ప్రారంభించాలి

ఎన్నికల ప్రక్రియను మళ్ళీ కొత్తగా ప్రారంభించాలి
X

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఎన్నికల ప్రక్రియను మళ్ళీ కొత్తగా ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించారని ఆరోపించారు. ప్రభుత్వానికి వంతపాడిన ఏ అధికారి భవిష్యత్ లో తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో జరిగిన అక్రమాలతో కూడిన నివేదికను కేంద్రానికి నివేదిక రూపంలో అందజేస్తామని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు. నామినేషన్ల ప్రక్రియ భయానక వాతావరణంలో దౌర్జన్యపూరితంగా, ఏకపక్షంగా జరిగాయన్నారు. భౌతిక దాడులు, ఆర్ధిక మూలాలు దెబ్బ తీసేందుకు ఆస్తులు ధ్వంసం చేస్తామని బెదిరించి ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్ధులతో బలవంతంగా నామినేషన్లు విత్ డ్రా చేయించారని తెలిపారు. “వైసీపీని గెలిపిస్తే రాష్ట్రంలో హింస ఎక్కువైపోతుందని సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు చెప్పాను. ప్రస్తుతం ఆంధప్రదేశ్ లో ఏ మారుమూల ప్రాంతంలో చూసినా హింసాత్మక సంఘటనలు, పాలెగాళ్ల రాజ్యమే కనిపిస్తుంది. ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో కూడా రౌడీయిజం పెరిగిపోయింది. వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల గెలుపుపై భయపడుతోంది.

ప్రతిపక్షాల అభ్యర్ధులను బెదిరించి, దాడులు చేసి గెలవాలని చూస్తోంది. ప్రభుత్వం ఎంత దిగజారి వ్యవహరించినా ప్రజాస్వామ్యం గొంతు నొక్కలేరు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడటం రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి కొమ్ముకాసే విధంగా ప్రవర్తించడం బాధాకరం. పాలన విభాగంలో తప్పులు జరిగితే సరిదిద్దాల్సిన అధికారులు... తమ కళ్లెదుటే ఇన్ని హింసాత్మక సంఘటనలు జరుగుతుంటే చేతులు కట్టుకొని చూశారు. ప్రభుత్వంతో ఏకమై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. నిన్న మూడు గంటలతో నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ పూర్తయితే... రాత్రి పది గంటల వరకు పోలీసుల సాయంతో ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్ధులను బెదిరించి నామినేషన్ విత్ డ్రా చేసుకునేలా చేశారు. ఏదైనా ప్రాంతంలో అభ్యర్ధిపై దాడులు జరిగితే అక్కడ ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలి. జనసేన అభ్యర్ధులు, వారితోపాటు నామినేషన్ వేయడానికి వెళ్లిన నాయకులపై దాడులు జరిగితే అసలు ఏమీ జరగనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో నామినేషన్ వేయాలంటే భయపడే పరిస్థితి దాపురించింది. ప్రజలను రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ పాలకులు, పై అధికారుల ఒత్తిళ్లతో వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించారు.

Next Story
Share it