తెలంగాణలో ఆ 45 మందికి కరోనా లేదు
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో కరోనా వైరస్ కేసులు నమోదు అయినా కూడా పరిస్థితి అదుపులోనే ఉంది. గాంధీ ఆస్పత్రిలో మంగళవారం నాడు 47 మందికి కొవిడ్ 19 పరీక్షలు నిర్వహించారు. ఈ విషయాన్ని పబ్లిక్ హెల్త్ డైరక్టర్ శ్రీనివాసరాజు వెల్లడించారు. 47 మందికి పరీక్షలు నిర్వహించగా..వారిలో 45 మంది షాంపిల్స్ నెగిటివ్గా తేలాయని పేర్కొన్నారు. మరో ఇద్దరి శాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించామని వెల్లడించారు. గురువారం నాటికి ఇందుకు సంబంధించిన రిపోర్టులు వచ్చే అవకాశం ఉందని.. అప్పటివరకు వీరిద్దరిని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ ఆస్పత్రిలో ఉంచుతామని అన్నారు.
ఇటలీ నుంచి వచ్చిన ఓ వ్యక్తి కోవిడ్-19 పాజిటివ్గా తేలారని శ్రీనివాస రాజు స్పష్టం చేశారు. అతడిని కలిసిన మరో వ్యక్తికి వైరస్ సోకినట్లుగా అనుమానిస్తున్నామన్నారు. ఇక వీరిద్దరు కాకుండా మిగిలిన 45 మంది నెగిటివ్గా తేలినప్పటికీ... 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండాల్సిందిగా సూచించినట్లు తెలిపారు. కరోనా సోకిన వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని.. అతడిని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మీడియా బులెటిన్ విడుదల చేసింది.