ఏపీలో తొలి కరోనా కేసు నమోదు

ఏపీలోనూ తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదు అయింది. ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా ఆంధ్రప్రదేశ్ లో లేదని అందరూ ధీమాగా ఉన్న సమయంలో ఈ కేసు వెలుగులోకి రావటంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది. నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి కరోనా సోకినట్టు వైద్య, ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. ఈ నెల 6న ఇటలీ నుంచి నెల్లూరుకు వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండటంతో అతన్ని నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. తిరుపతి స్విమ్స్ లోని వైరాలజీ ల్యాబ్లో అతని నుంచి సేకరించిన శాంపిల్స్ను పరీక్షించగా కరోనా సోకినట్టు తేలింది.
అయితే ప్రస్తుతం కరోనా సోకిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. 14 రోజుల చికిత్స తర్వాత మరోసారి అతనికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి.. నెగిటివ్గా తేలిన తర్వాత డిశ్చార్జ్ చేస్తామన్నారు. కరోనా సోకిన వ్యక్తి నెల్లూరుకు వచ్చాక అతనితో సన్నిహితంగా ఉన్న ఐదుగురు వ్యక్తులను కూడా ఐసోలేషన్ వార్డులో ఉంచారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని ప్రత్యేక కేంద్రాల్లో ఉంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.